సీఎం జగన్ సంచలన నిర్ణయం... నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు

సీఎం జగన్ సంచలన నిర్ణయం... నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు

YCP suspends four MLAs
  • ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి చేదు అనుభవం
  • టీడీపీ ఎమ్మెల్సీగా పంచుమర్తి అనురాధ గెలుపు
  • నలుగురు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్టు అనుమానించిన వైసీపీ
  • మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడి, ఆనం, ఉండవల్లి శ్రీదేవిలపై నేడు వేటు
నిన్న జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు రావడంపై వైసీపీ హైకమాండ్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ క్రమంలో పంచుమర్తి అనురాధకు అనుకూలంగా ఓటు వేశారంటూ నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ తాజాగా వేటు వేసింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలను సస్పెండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ వీరిపై చర్యలు తీసుకున్నారు. 

వైసీపీ అగ్రనేత సజ్జల రామకృష్ణారెడ్డి దీనిపై వివరిస్తూ... చంద్రబాబు ఒక్కొక్కరికి రూ.15 కోట్ల వరకు ఇచ్చి కొన్నారని ఆరోపించారు. ఇలాంటి కొనుగోలు వ్యవహారాలు ఏ పార్టీకైనా నష్టమేనని అభిప్రాయపడ్డారు. రోగ కారకాన్ని తక్షణమే గుర్తించి ఇలాంటి వాటిని తొలగించుకోవాలని సజ్జల వ్యాఖ్యానించారు. అందుకే తమ పార్టీ అధ్యక్షుడు సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. విశ్వాసం లేనప్పుడు పార్టీలో ఉంచడం అనవసరమనే సస్పెండ్ చేసినట్టు వివరణ ఇచ్చారు. 

కేవలం అసంతృప్తి వల్లే ఎవరూ బయటికి వెళ్లరని, ప్రలోభపెట్టడం వల్లే తమ వాళ్లు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని సజ్జల పేర్కొన్నారు. టీడీపీ నేతలు తమపై అభిమానంతో వచ్చారని, ఆ పార్టీలో అసంతృప్తి వల్లే వారు బయటికి వచ్చారని వివరించారు.
Advertisement
MLAs
YSRCP
Suspension
Cross Voting
MLC Elections

More Telugu News