యుద్ధంలో ఉక్రెయిన్‌ను గెలిపించడమే లక్ష్యం: అమెరికా కీలక ప్రకటన

ఉక్రెయిన్-రష్యా మధ్య కొనసాగుతున్న సుదీర్ఘ యుద్ధం నేపథ్యంలో అమెరికా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌ను గెలిపించడమే తమ లక్ష్యమని వైట్‌హౌస్ ప్రకటించింది. ఉక్రెయిన్‌కు అత్యాధునిక ‘లెపర్డ్-2’ ట్యాంకులను సరఫరా చేస్తామని జర్మనీ ప్రకటించిన తర్వాత అమెరికా ఈ ప్రకటన చేసింది. యుద్ధంలో ఉక్రెయిన్‌ను గెలిపించేందుకు నాటో దేశాలతో కలిసి అన్ని రకాలుగా ప్రయత్నిస్తామని పేర్కొంది. యుద్ధభూమిలో విజయం సాధించేందుకు అవసరమైన సామర్థ్యాలను ఉక్రెయిన్‌కు అందేలా చేయడం తమ మిత్రదేశాల లక్ష్యమని అమెరికా జాతీయ భద్రతా సలహా మండలి స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ సమన్వయ కర్త జాన్ కిర్బీ తెలిపారు. 

కాగా, 14 లెపర్డ్-2 ఎ6 ట్యాంకులను ఉక్రెయిన్‌‌కు అందిస్తామని జర్మనీ ప్రకటించిన వెంటనే అమెరికా కూడా అలాంటి ప్రకటనే చేసింది. అత్యాధునిక అబ్రామ్స్ ట్యాంకులను సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు, ఆఫ్రికాలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందంటూ రష్యాకు చెందిన ‘వాగ్నర్’తోపాటు దాని అనుబంధ సంస్థలపైనా అమెరికా ఆంక్షలు విధించింది.


More Telugu News