Tollywood: రేపు హైదరాబాద్ కు జగన్... కృష్ణకు నివాళి అర్పించనున్న ఏపీ సీఎం

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (బుధవారం) హైదరాబాద్ పర్యటనకు వెళ్లనున్నారు. మంగళవారం తెల్లవారుజామున టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందిన సంగతి తెలిసిందే. కృష్ణ భౌతిక కాయానికి నివాళి అర్పించేందుకే జగన్ హైదరాబాద్ పర్యటనకు వెళ్లనున్నారు. వృద్ధాప్యం నేపథ్యంలో అనారోగ్య  సమస్యలకు గురైన కృష్ణ హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. రేపు సాయంత్రం జూబ్లీ హిల్స్ మహా ప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి.

ఈ క్రమంలో కృష్ణ అంత్యక్రియలకు ముందే హైదరాబాద్ కు రానున్న జగన్... నేరుగా పద్మాలయ స్టూడియోకు వెళతారు. అక్కడే ఆయన కృష్ణ భౌతికకాయానికి నివాళి అర్పిస్తారు. కృష్ణ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శిస్తారు. అనంతరం ఆయన తిరిగి తాడేపల్లి వెళతారు. కృష్ణ భార్య ఇందిరా దేవి మరణించినప్పుడు కూడా హైదరాబాద్ కు వచ్చిన జగన్... కృష్ణను పరామర్శించిన సంగతి తెలిసిందే.
Tollywood
Super Star
Krishna
YSRCP
YS Jagan
Hyderabad

More Telugu News