విలేజ్ సెక్రటరీలు, వాలంటీర్లు, ఆర్టీసీ ఉద్యోగులకు ఏ నెల జీతం ఆ నెల ఇచ్చినట్లు చూపితే రాజీనామా చేస్తా: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు
- 9వ తేదీ వచ్చినా 30 శాతం మంది ఉద్యోగులకు జీతాలు రాలేదు
- ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 3 నెలల నుంచి జీతాలు లేవు
- రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయింది
'ఆప్కాస్ పేరుతో 99 వేల మంది ఉద్యోగులు రిజిష్టర్ చేయించుకున్నారు. ఒక్క నెలలో కూడా ఆప్కాస్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏ నెలకు ఆ నెల పూర్తిగా జీతాలు ఇచ్చిన దాఖలాలు లేవు. 80 శాతం జీతాలు ఇచ్చి 20 శాతం టెక్నికల్ సమస్యలు వచ్చాయని దాటవేస్తూ వస్తున్నారు. రెగ్యులర్ గా జీతాలు ఇవ్వలేని ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రం ఉంది. 2022వ సంవత్సరం మొదలైనప్పటి నుంచి ఇదే పరిస్థితి ఉంది. 2021లో కూడా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో జీతాలు ఇవ్వడంలో ఆలస్యం జరిగింది. ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. రాష్ట్రం కేవలం అప్పులపై ఆధారపడి నడుస్తోంది. అప్పులు తెచ్చి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితులున్నాయి' అని చెప్పారు. కార్యదర్శులు, వాలంటీర్లు, ఆర్టీసీ ఉద్యోగులకు ఏ నెల జీతం ఆ నెల ఇచ్చినట్లు చూపలేకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగస్తుల జీతాల విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం సరికాదని అన్నారు.