నన్ను కాదని ధోనీని కెప్టెన్ చేశారు.. నేను కెప్టెన్ కాకుండా బీసీసీఐలోని కొన్ని శక్తులు అడ్డుకున్నాయి: యువీ ఆరోపణలు

Some BCCI Officials Stopped Me From Captaincy
తాను కెప్టెన్ కాకుండా బీసీసీఐలోని కొన్ని శక్తులు అడ్డుకున్నాయని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నాడు. 2007 టీ 20 వరల్డ్ కప్ కు తనను కాదని మహేంద్ర సింగ్ ధోనీని కెప్టెన్ గా చేశారన్నాడు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సంజయ్ మంజ్రేకర్ తో యువీ ఈ వ్యాఖ్యలు చేశాడు. గ్రెగ్ చాపెల్ కోచ్ గా ఉన్న సమయంలో తాను సచిన్ వైపు ఉన్నానని, అది చాలా మంది బీసీసీఐ అధికారులకు రుచించలేదని చెప్పాడు. 

‘‘వాస్తవానికి 2007లో నేనే కెప్టెన్ అవ్వాల్సి ఉండే. కానీ, అప్పుడే గ్రెగ్ చాపెల్ ఘటన జరిగింది. చాపెలా? సచినా? అన్నంతలా వివాదం ముదిరింది. నేను సచిన్ వైపే ఉన్నా. బహుశా జట్టులో ఆటగాడికి మద్దతుగా నిలిచింది నేను ఒక్కడినే అనుకుంటా. అది బీసీసీఐలోని చాలా మంది అధికారులకు నచ్చలేదు. నన్ను తప్ప వేరే ఎవరినైనా కెప్టెన్ గా చేస్తామంటూ వారు చెప్పారని తెలిసింది. అది ఎంత వరకు నిజమో నాకైతే తెలియదు. 

సడన్ గా ఓ రోజు నన్ను వైస్ కెప్టెన్ పదవి నుంచి తప్పించారు. అప్పుడు సెహ్వాగ్ జట్టులో లేడు. దీంతో మహేంద్ర సింగ్ ధోనీని టీ20 వరల్డ్ కప్ కు కెప్టెన్ గా నియమించారు. వాస్తవానికి వైస్ కెప్టెన్ గా తొలగించే సరికి నన్నే కెప్టెన్ చేస్తున్నారనుకున్నా. ఇంగ్లండ్ టూర్ లో వీరేంద్ర సెహ్వాగ్ లేకపోవడంతో నన్ను వన్డేలకు వైస్ కెప్టెన్ గా ఉంచారు. కానీ, నాకు వ్యతిరేకంగా నిర్ణయం జరిగిపోయింది. దాని గురించి నేనేమీ చింతించట్లేదు. ఆరోజు జరిగిన ఘటనే ఇప్పుడూ జరిగినా జట్టు సభ్యుడివైపే నేను నిలబడతాను’’ అని యువీ చెప్పుకొచ్చాడు. 

టీ20 కెప్టెన్ తర్వాత.. వన్డేల్లోనూ మహీ రాణిస్తాడని అనుకున్నట్టు చెప్పాడు. వన్డేల్లో తాను కెప్టెన్ అయ్యే అవకాశాలున్నా గాయాలు తనను దూరం చేశాయని వివరించాడు. ఒకవేళ తాను కెప్టెన్ అయినా గాయాలతో దూరమయ్యేవాడినని పేర్కొన్నాడు. ఏది జరిగినా అంతా మంచి కోసమేనన్నాడు.
Go Back to Shorts
Cricket
Yuvraj Singh
Team India
BCCI

More Telugu News