Cricket: ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఘోర వైఫల్యానికి కారణమిదేనట!

This Is The Reason Behind The Mumbai Indians Losses In IPL
  • అభిప్రాయం చెప్పిన కెవిన్ పీటర్సన్
  • మెగా వేలంతోనే పతనం మొదలైందని వెల్లడి
  • స్టార్ ఆటగాళ్లను వదిలేసుకుందని ఆక్షేపణ
  • గాయపడిన ఆర్చర్ కోసం బౌల్ట్ ను వదిలేయడమా? అని ప్రశ్న
  • పాండ్యా సోదరులు, డికాక్ ను వదిలేయడంపైనా ఆశ్చర్యం
రోహిత్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలిచి.. ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. అలాంటి జట్టు ఏడు మ్యాచ్ లు ఆడినా.. ఒక్క మ్యాచ్ లోనూ గెలవకుండా ఉంటుందని ఊహించడం సాధ్యమా! కానీ, ఐపీఎల్ 2022లో మాత్రం అదే జరిగింది. ఆడిన ఏడు మ్యాచుల్లో ఒక్క దాంట్లోనూ గెలవలేదు. మరి, లోపం ఎక్కడుంది? దానికి ఇంగ్లండ్ మాజీ దిగ్గజ ఆటగాడు కెవిన్ పీటర్సన్ సమాధానమిస్తున్నాడు. 

మెగా వేలంతోనే ఆ జట్టు వైఫల్యం మొదలైందని, ఈ సీజన్ వారికి ఓ ఉత్పాతమని పీటర్సన్ చెప్పాడు. ఆ వేలం వల్ల జట్టు ఆత్మ పూర్తిగా తునాతునకలైందని అన్నాడు. వేలంలో ముంబై వ్యూహంపై మండిపడ్డాడు. గాయంతో ఉన్న జోఫ్రా ఆర్చర్ కోసం మంచి ఫామ్ లో ఉన్న ట్రెంట్ బౌల్ట్ ను వదిలేసుకోవడం అతిపెద్ద తప్పని చెప్పాడు. 

ప్రస్తుతం ముంబై బౌలింగ్ చాలా బలహీనంగా మారిపోయిందని, అంత బలహీన బౌలింగ్ దళం ఇంతకుముందెన్నడూ లేదని వాపోయాడు. పొట్టి గేమ్ లలో లెఫ్టార్మ్ సీమర్లు చాలా అవసరమని,  అందులో బౌల్ట్ వరల్డ్ క్లాస్ అని వ్యాఖ్యానించాడు. వేలంలో మ్యాచ్ విన్నర్లయిన పాండ్యా సోదరులు, క్వింటన్ డికాక్ వంటి వారిపై దృష్టి పెట్టకపోవడం విచారకరమన్నారు. ఇప్పుడు జట్టులో ఏం జరుగుతోందో తెలియక మహేలా జయవర్ధనే షాక్ అవుతుండొచ్చు అని అన్నాడు. మొత్తానికి ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాళ్లను మాత్రం కోల్పోయిందని పీటర్సన్ వ్యాఖ్యానించాడు. 

Cricket
Mumbai Indians
IPL
Rohit Sharma
Kevin Pieterson

More Telugu News