vinod kumar: తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లను 153కు పెంచాల్సిందే: వినోద్ కుమార్
![vinod kumar slams modi govt](https://img.ap7am.com/bimg/cr-20210627tn60d8298aeb36b.jpg)
- జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ సీట్లు పెంచాలని యత్నం
- మరి తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు పెంచరు?
- రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుందని మోదీ అన్నారు
- ఈ రాజ్యాంగ సవరణ అంశం జమ్మూకశ్మీర్కు వర్తించదా?
తెలంగాణలో ప్రస్తుతమున్న 119 అసెంబ్లీ సీట్లను 153కు పెంచాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ సీట్లు పెంచాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అక్కడ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.
మరి తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఎందుకు కుదరదని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరితే 2026 వరకు అసెంబ్లీ సీట్ల పెంపు కుదరదని చెప్పారని అన్నారు. అందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారని, మరి ఇప్పుడు ఈ రాజ్యాంగ సవరణ అంశం జమ్మూకశ్మీర్కు వర్తించదా? అని నిలదీశారు. మోదీ సర్కారు చెబుతోన్న ఒకే దేశం, ఒకే చట్టం అంటే ఇదేనా? అని ఆయన ప్రశ్నించారు.