VH: తెలంగాణలో కాంగ్రెస్ దుస్థితికి వాళ్లిద్దరే కారణం: వీహెచ్

VH alleges Uttam and Bhatti are responsible for the worse situation of the Congress
  • తెలంగాణ పీసీసీపై ఎటూ తేల్చని హైకమాండ్
  • వీహెచ్ అసంతృప్తి
  • ఉత్తమ్, భట్టి కాంగ్రెస్ ను భ్రష్టుపట్టించారని వెల్లడి
  • సమీక్ష చేసే నాయకుడే లేడని విమర్శలు
తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడిపై కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికీ తేల్చని నేపథ్యంలో సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైందని, అందుకు కారకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క అని ఆరోపించారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నా, ఇంతవరకు పరిస్థితిని సమీక్ష చేసే నాయకుడే లేడని విమర్శించారు.

ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలే ఏకపక్షంగా పీసీసీ అధ్యక్షుడ్ని నియమిస్తే, పార్టీలో ఎవరు ఉంటారో, ఎవరు ఉండరో తెలియని పరిస్థితి ఏర్పడుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రానికి పరిశీలకుడు వచ్చి వెళ్లాకే పీసీసీ నూతన అధ్యక్షుడ్ని ప్రకటించాలని పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికలో ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోరాదని హితవు పలికారు.

రాష్ట్రంలో ఏదైనా వివాదం ఏర్పడితే హైకమాండ్ పరిశీలకుడిని పంపడం సర్వసాధారణం అని, కర్ణాటకలో గొడవ వస్తే మధుసూదన్ మిస్త్రీని పంపారని వెల్లడించారు. కానీ తెలంగాణలో వివాదం వస్తే పార్టీ ఇన్చార్జి మాణికం ఠాగూర్ చెప్పిందే తుది నిర్ణయమా? అని వీహెచ్ ప్రశ్నించారు. తమ గోడు ఎవరి ముందు వెళ్లబోసుకోవాలో అర్థంకావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News

VH
Congress
Telangana
Uttam Kumar Reddy
Mallu Bhatti Vikramarka
PCC