Mamata Banerjee: క్రూరమైన మహిళను ఎన్నుకొని తప్పు చేశారు: తృణమూల్‌ గెలుపుపై కేంద్ర మంత్రి

Babul Supriyo describes mamata banerjee as Cruel lady
  • బెంగాల్‌ ఎన్నికల ఫలితాలపై బాబుల్‌ సుప్రియో అసహనం
  • ప్రజలు తప్పు చేశారని వ్యాఖ్య
  • అవినీతి, అసమర్థ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని విమర్శ
  • మమతను క్రూరమైన మహిళ అంటూ ఘాటు వ్యాఖ్యలు
రాజకీయాల్లో ఎంతటి ప్రత్యర్థులైనప్పటికీ.. ఎన్నికల్లో గెలిచిన వారికి ఓడినవారు శుభాకాంక్షలు తెలియజేయడం భారతదేశంలో ఉన్న ఓ సంప్రదాయం. కానీ, కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో మాత్రం దాన్ని బ్రేక్‌ చేశారు. పైగా ప్రజల తీర్పును తప్పుబట్టారు. బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ గెలుపుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ సీఎం మమతా బెనర్జీపై ఘాటు విమర్శలు చేశారు.

‘‘నేను మమతా బెనర్జీకి శుభాకాంక్షలు తెలియజేయదలచుకోలేదు. అలాగే ప్రజల తీర్పును గౌరవిస్తున్నానని చెప్పడానికి కూడా ఇష్టపడడం లేదు. బీజేపీకి అవకాశం ఇవ్వకుండా బెంగాల్‌ ప్రజలు పెద్ద తప్పు చేశారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అవినీతి, అసమర్థ, నిజాయతీ లేని ప్రభుత్వాన్ని.. ‘క్రూరమైన మహిళ’ను ఎన్నుకొని తప్పు చేశారు. అయితే, చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా.. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఇచ్చిన తీర్పును అంగీకరిస్తున్నాను అని మాత్రమే చెబుతాను. అంతకు మించి ఏమీ చెప్పలేను’’ అని ఫేస్‌బుక్‌లో ఓ వీడియోను విడుదల చేశారు.

మరోవైపు కేంద్ర మంత్రి మండలిలో ఆయన సహచరులైన రాజ్‌నాథ్‌ సింగ్‌, నిర్మలా సీతారామన్‌ సహా మరికొంత మంది మంత్రులు మమతా బెనర్జీకి శుభాకాంక్షలు తెలియజేశారు. బెంగాల్‌లో మమత నేతృత్వంలోని తృణమూల్‌ భారీ విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
Mamata Banerjee
Babul Supriyo
Trinamool Congress
Bengal Assembly election

More Telugu News