పవన్ ను విమర్శించే హక్కు మీకు లేదు: సీపీఐ నారాయణపై వీర్రాజు ఫైర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించడాన్ని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తప్పుబట్టారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత విషయాలపై మాట్లాడే నైతిక హక్కు నారాయణకు లేదని మండిపడ్డారు.

గత ఎన్నికల్లో పవన్ తో పొత్తు పెట్టుకున్నప్పుడు మీరు మీ యొక్క జ్ఞాపకశక్తిని కోల్పోయారా? అని ప్రశ్నించారు. అద్వానీగారి మీద కేసును సీబీఐ కోర్టు కొట్టివేయడంపై మాట్లాడే అర్హత కూడా నారాయణకు లేదని అన్నారు.

ప్రధాని మోదీ కాళ్లను పవన్ మొక్కుతున్నారని నారాయణ అన్నారు. గత ఎన్నికల్లో ఆయనతో అనవసరంగా పొత్తు పెట్టుకున్నామని, ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని చెప్పారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కు వ్యక్తిత్వమే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ సోము వీర్రాజు మండిపడ్డారు.


More Telugu News