SP Balasubrahmanyam: లేచి కూర్చోగలుగుతున్న ఎస్పీ బాలు... త్వరలో నోటి ద్వారా ఆహారం!

SP Charan gives lates health update of SP Balasubrahmanyam
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నెలరోజులకు పైగా కరోనా మహమ్మారితో పోరాడుతున్నారు. ఆగస్టు 5న ఆయన చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. కొన్నిరోజుల తర్వాత పరిస్థితి విషమించడంతో అప్పటి నుంచి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితిపై ఆయన తనయుడు ఎస్పీ చరణ్ వివరాలు తెలిపారు. సెప్టెంబరు 10వ తేదీన చివరిసారిగా హెల్త్ అప్ డేట్ ఇచ్చానని, మళ్లీ ఇప్పుడు మీ ముందుకు వచ్చాను అంటూ చరణ్ ఓ వీడియో సందేశం వెలువరించారు. ఈ నాలుగు రోజుల వ్యవధిలో తన తండ్రి ఆరోగ్యం ఎంతో మెరుగైందని తెలిపారు.

ఊపిరితిత్తుల పనితీరు కూడా గతంతో పోల్చితే ఎంతో సవ్యంగా ఉందని, ఫిజియోథెరపీకి తన తండ్రి చురుగ్గా స్పందిస్తున్నారని వెల్లడించారు. డాక్టర్ల ప్రయత్నం కారణంగా ఆయన 15 నుంచి 20 నిమిషాల సేపు కూర్చోగలుగుతున్నారని చరణ్ వివరించారు. ఇకపై నోటి ద్వారా ఆహారం అందించబోతున్నారని, ఇప్పటివరకు అన్నీ సానుకూలాంశాలే ఉన్నాయని, ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. తన తండ్రి కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వీడియోలో పేర్కొన్నారు.
Go Back to Shorts
SP Balasubrahmanyam
SP Charan
Corona Virus
Health Update
MGM Hospital
Chennai

More Telugu News