Khairatabad: ఎంత వద్దని చెబుతున్నా వినని హైదరాబాద్ ప్రజలు... తలపట్టుకుంటున్న ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ!

Huge Rush at Khairatabad Ganesh Idol
  • భక్తులు రావద్దని కోరుతున్న కమిటీ
  • వినకుండా తరలివస్తున్న భక్తులు
  • సెల్ఫీల కోసం పోటీ
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఖైరతాబాద్ గణనాధుడిని దర్శించుకునేందుకు భక్తులు రావద్దని, ఆన్ లైన్ లోనే పూజలు, దర్శనం చేసుకోవాలని గణేశ్ ఉత్సవ కమిటీ ఎంతగా విజ్ఞప్తి చేసినా, భక్తులు వినలేదు. ప్రతియేటా పెట్టే 60 అగుడుల భారీ విగ్రహం స్థానంలో, ఈ సంవత్సరం 9 అడుగుల మట్టి విగ్రహాన్ని మాత్రమే ఏర్పాటు చేసినా, తొలిరోజునే పెద్దఎత్తున ప్రజలు స్వామి దర్శనానికి వచ్చారు. ఒక్కరంటే ఒక్కరు కూడా భౌతిక దూరం పాటించాలన్న ఆలోచన లేకుండా, సెల్ఫీలకు ఎగబడ్డారు. పలువురు కనీసం మాస్క్ లు కూడా ధరించక పోవడం గమనార్హం. వీరిని నియంత్రించలేక ఉత్సవ కమిటీ ఇబ్బందులు పడింది.

కాగా, ఈ సంవత్సరం ధన్వంతరి నారాయణ గణపతిగా, చేతిలో వనమూలికలు, వైద్య పుస్తకంతో స్వామి కనిపిస్తున్నారు. కరోనా కారణంగా నేరుగా దర్శనం లేదని, దూరం నుంచి స్వామిని చూసి వెళ్లిపోవాలని నిర్వాహకులు పదేపదే చెబుతున్నా, ఎవరూ వినే పరిస్థితులు అక్కడ కనిపించడం లేదు.
Khairatabad
Ganesh
People

More Telugu News