పూటకొక జఫ్ఫా వచ్చి తాడేపల్లిలో కూర్చుని ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నారు: బొండా ఉమ

TDP leader Bonda Uma furious on YSRCP
  • రాష్ట్రంలో ఐటీ దాడులు
  • వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటలయుద్ధం
  • చంద్రబాబు వద్ద లక్షల కోట్లు దొరుకుతాయంటూ వైసీపీ నేతల వ్యాఖ్యలు
  • ఘాటుగా బదులిచ్చిన బొండా ఉమ
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి మాజీ పీఎస్ శ్రీనివాస్ నివాసంలో ఆరు రోజుల పాటు ఐటీ సోదాలు జరగడం తెలిసిందే. దీనిపై వైసీపీ తీవ్రస్థాయిలో చేస్తున్న విమర్శలకు టీడీపీ నేతలు కూడా అంతేస్థాయిలో బదులిస్తున్నారు. తాజాగా, బొండా ఉమ ఘాటుగా స్పందించారు. శ్రీనివాస్ నివాసంలో ఐటీ సోదాలు జరిగితే, ఆ సోదాల్లో రూ.2 వేల కోట్లు దొరికాయని రాష్ట్రంలో ఉన్న జఫ్ఫా బ్యాచ్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. పొద్దునొక జఫ్ఫా, మధ్యాహ్నం ఒక జఫ్ఫా, సాయంత్రం ఒక జఫ్ఫా తాడేపల్లిలో కూర్చుని ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"మాజీ పీఎస్ దగ్గర రూ.2 వేల కోట్లు దొరికితే చంద్రబాబు వద్ద లక్షల కోట్లు దొరుకుతాయి అంటూ అసత్య ప్రచారం సాగిస్తున్నారు. దీనిపై చంద్రబాబును, లోకేశ్ ను విచారించాలంట! అవినీతి పునాదులపైనే పుట్టిన వైసీపీ ఆ అవినీతి మరకలను టీడీపీకి కూడా అంటించాలని తప్పుడు ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారంతోనే మీ విశ్వసనీయత ఏంటో బట్టబయలైంది" అంటూ ధ్వజమెత్తారు.
Go Back to Shorts
Bonda Uma
IT Raids
Chandrababu
Telugudesam
YSRCP
Andhra Pradesh

More Telugu News