డ్రైవర్ హత్య కేసు.. కోర్టుకు హాజరైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు
దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఈరోజు రాజమండ్రి జిల్లా కోర్టుకు హాజరయ్యారు. 2022లో సంచలనం సృష్టించిన ఈ కేసులో అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గను సిట్ తన సప్లిమెంటరీ చార్జ్షీట్లో రెండో నిందితురాలిగా (ఏ2) చేర్చిన సంగతి తెలిసిందే.
తనను ఈ కేసు నుంచి తొలగించాలంటూ లక్ష్మీ దుర్గ దాఖలు చేసిన పిటిషన్పై రాజమండ్రి జిల్లా కోర్టులో నేడు వాదనలు జరగనున్నాయి. బాధితుల తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు తన వాదనలను వినిపించనున్నారు. హత్య అనంతరం ఆధారాలను ధ్వంసం చేయడంలోనూ, మృతదేహాన్ని తరలించడంలోనూ ఆమె పాత్ర ఉందని సిట్ ఆరోపించింది. ఈ క్రమంలో గతంలో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయ్యింది.
హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న లక్ష్మీ దుర్గ, ఇప్పటికే హైకోర్టు ఆదేశాల మేరకు సిట్ విచారణకు హాజరయ్యారు. అయితే, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన పేరును నిందితుల జాబితా నుంచి తొలగించాలని ఆమె కోర్టును కోరుతున్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు కోర్టుకు హాజరుకావడం, ఆయన భార్య దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్పై నేడు జరగబోయే వాదనలతో ఈ కేసులో ఎలాంటి మలుపులు చోటుచేసుకుంటాయోనని సర్వత్ర ఆసక్తి నెలకొంది.