Amit Shah: పశ్చిమాసియా ఉద్రిక్తతలు: వాస్తవాలు వివరించనున్న కేంద్రం.. అమిత్ షా ఆధ్వర్యంలో కీలక భేటీ

West Asia Crisis Amit Shah to Hold All Party Meeting
షార్ట్స్‌లో చూడండి
పశ్చిమాసియాలో రోజురోజుకు ముదురుతున్న సంక్షోభం భారత్‌పై చూపే ఆర్థిక, భద్రతాపరమైన ప్రభావాలపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ కీలక అంశంపై రాజకీయ పార్టీలకు వాస్తవ పరిస్థితిని వివరించి, వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు సాయంత్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. పార్లమెంట్ లో సాయంత్రం 5 గంటలకు ఈ భేటీ జరగనుంది.

ఈ సమావేశంలో ప్రభుత్వం తరఫున విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో పాటు మరో ఐదారుగురు మంత్రులు పాల్గొననున్నారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పశ్చిమాసియాలోని తాజా పరిణామాలు, ఉద్రిక్తతలు, భారత్‌పై వాటి ప్రభావాన్ని రాజకీయ పార్టీల నేతలకు సమగ్రంగా వివరించనున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్నది ఒక అపూర్వమైన సంక్షోభమని, దీని ప్రభావం దీర్ఘకాలం ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పార్లమెంట్ ఉభయ సభల్లో పేర్కొన్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

గత నాలుగు వారాలుగా కొనసాగుతున్న ఈ యుద్ధం కారణంగా హ‌ర్మూజ్ జలసంధి వంటి కీలకమైన సముద్ర వాణిజ్య మార్గాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇది ప్రపంచ ఇంధన మార్కెట్లలో అస్థిరతకు దారితీయడమే కాకుండా అంతర్జాతీయ సరఫరా గొలుసులపై ప్రభావం చూపి ద్రవ్యోల్బణానికి కారణమవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం రాజకీయ పార్టీలతో సంప్రదింపులు ముమ్మరం చేసింది.

పార్లమెంటులో పూర్తిస్థాయి చర్చ జరపాలని పట్టుబడుతున్న విపక్షాలు
అయితే, ఈ అంశంపై కేవలం వివరణ ఇవ్వడమే కాకుండా పార్లమెంటులో పూర్తిస్థాయి చర్చ జరపాలని కాంగ్రెస్ సహా విపక్షాలు పట్టుబడుతున్నాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా సభలో సమగ్ర చర్చ అవసరమని రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అభిప్రాయపడ్డారు. మరోవైపు ప్రభుత్వ విదేశాంగ విధానం వ్యక్తిగత ప్రయోజనాలతో రాజీపడిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే, కేరళలో ముందుగా ఖరారైన కార్యక్రమం కారణంగా తాను ఈ సమావేశానికి హాజరుకాలేకపోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఈ అఖిలపక్ష భేటీకి ఒకరోజు ముందు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు, డీఆర్‌డీఓ ఛైర్మన్ డాక్టర్ సమీర్ కామత్‌లతో ఉన్నతస్థాయి భద్రతా సమీక్ష జరిగింది. మారుతున్న అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశ భద్రతకు సంబంధించిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ ప్రయోజనాల విషయంలో విస్తృత రాజకీయ ఏకాభిప్రాయం సాధించడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది.
Go Back to Shorts
Amit Shah
West Asia crisis
India
All-Party Meeting
S Jaishankar
Vikram Misri
Hormuz Strait
Inflation
Parliament
Rajanth Singh

More Telugu News