Indian Sports Economy: భారత క్రీడా ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డు... క్రికెట్‌దే అధిక వాటా!

Indian Sports Economy Surpasses 2 Billion Dollars Driven by Cricket
షార్ట్స్‌లో చూడండి
భారత క్రీడా ఆర్థిక వ్యవస్థ చరిత్రలో తొలిసారిగా సరికొత్త మైలురాయిని అధిగమించింది. 2025లో మొదటిసారిగా 2 బిలియన్ డాలర్ల మార్కును దాటి, మొత్తం 2.13 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.18,864 కోట్లు) చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 13.4 శాతం వృద్ధి. కేవలం నాలుగేళ్లలో ఈ రంగం రెట్టింపు పరిమాణానికి విస్తరించడం విశేషం. అయితే ఈ అద్భుతమైన వృద్ధిలో సింహభాగం ఒక్క క్రికెట్‌దే కావడం గమనార్హం. ప్రముఖ మీడియా సంస్థ డబ్ల్యూపీపీ తన 'స్పోర్టింగ్ నేషన్: బిల్డింగ్ ఏ లెగసీ' నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. ఈ వివరాలను ప్రధానమంత్రి కార్యాలయం సోషల్ మీడియాలో పంచుకుంది.

దేశ క్రీడా రంగం మొత్తం ఆదాయంలో క్రికెట్ వాటా ఏకంగా 89 శాతంగా నమోదైంది. 2024లో 85 శాతంగా ఉన్న ఈ వాటా మరింత పెరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 2025లో కేవలం క్రికెట్ ద్వారానే రూ.16,704 కోట్ల ఆదాయం రాగా, ఇది 2024లోని మొత్తం భారత క్రీడా ఆర్థిక వ్యవస్థ (రూ.16,633 కోట్లు) కంటే ఎక్కువ. అంటే, మిగతా క్రీడలన్నీ కలిపి కూడా క్రికెట్ దరిదాపుల్లోకి రాలేకపోయాయి.

ఆదాయ వనరుల్లోనూ క్రికెట్ హవా

డబ్ల్యూపీపీ నివేదిక ప్రకారం, ఈ మొత్తం విలువను మూడు ప్రధాన ఆదాయ వనరుల ఆధారంగా లెక్కించారు. మీడియా ప్రకటనల ఖర్చుల రూపంలో అత్యధికంగా రూ.9,571 కోట్లు రాగా, ఇందులో 95 శాతం (రూ.9,026 కోట్లు) వాటా ఒక్క క్రికెట్‌దే. స్పాన్సర్‌షిప్ (గ్రౌండ్, టీమ్, ఫ్రాంచైజీ ఫీజులు) ద్వారా రూ.7,943 కోట్లు సమకూరగా, ఇందులో క్రికెట్ వాటా 81 శాతంగా ఉంది. ఒక్క ఐపీఎల్ టీమ్‌ల స్పాన్సర్‌షిప్ విలువే రూ.1,000 కోట్లు దాటింది. ఇక అథ్లెట్ ఎండార్స్‌మెంట్ల ద్వారా వచ్చిన రూ.1,350 కోట్లలో 87 శాతం క్రికెటర్లకే దక్కింది. ఐపీఎల్ ఘనవిజయం, భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం, మహిళల వన్డే ప్రపంచకప్ విజయం, మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వంటివి క్రికెట్ వృద్ధికి మరింత ఊతమిచ్చాయి.

వెనుకబడ్డ ఇతర క్రీడలు

ఒకవైపు క్రికెట్ 17.9 శాతం వృద్ధి నమోదు చేయగా, ఫుట్‌బాల్, కబడ్డీ వంటి ఇతర 'ఎమర్జింగ్ స్పోర్ట్స్' ఆదాయం 12.2 శాతం తగ్గింది. దీంతో మొత్తం క్రీడా ఆదాయంలో వాటి వాటా 11 శాతానికి పడిపోయింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ వాయిదా పడటం దీనికి ప్రధాన కారణంగా నివేదిక పేర్కొంది. 2024లో పారిస్ ఒలింపిక్స్ వల్ల ఇతర క్రీడలపై ఆసక్తి పెరిగినా, 2025లో అలాంటి ప్రధాన ఈవెంట్లు లేకపోవడం కూడా ప్రభావం చూపింది.

"భారత్ ప్రపంచ క్రికెట్‌కు యాంకర్ మార్కెట్‌గా ఉంది. ఇక్కడ మహిళల క్రికెట్‌పై పెరుగుతున్న ఆసక్తి భవిష్యత్తులో మరింత వృద్ధికి కారణమవుతుంది" అని ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా అన్నారు. డబ్ల్యూపీపీ మీడియా సౌత్ ఏషియా ఎండీ వినిత్ కర్నిక్ మాట్లాడుతూ, "క్రీడలు ఇప్పుడు సంస్కృతి, వాణిజ్యం మధ్య వారధిగా మారాయి. బ్రాండ్లు కేవలం స్పాన్సర్లుగా మిగిలిపోకుండా, కార్యాచరణలో భాగమవుతున్నాయి" అని విశ్లేషించారు.

సోషల్ మీడియాలో కూడా క్రికెటర్ల ప్రభావమే ఎక్కువగా ఉంది. ఒక నివేదిక ప్రకారం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్‌తో పోలిస్తే నీరజ్ చోప్రా, సునీల్ ఛెత్రి వంటి ఇతర క్రీడాకారులు చాలా వెనుకబడి ఉన్నారు. మొత్తం మీద, ఈ నివేదిక భారత క్రీడా రంగంలో క్రికెట్ తిరుగులేని స్థానాన్ని స్పష్టం చేస్తోంది. మిగతా క్రీడలు నిలదొక్కుకోవాలంటే భారీ పెట్టుబడులు, మీడియా మద్దతు అత్యవసరమని స్పష్టమవుతోంది.

Go Back to Shorts
Indian Sports Economy
Cricket
Sports Business
IPL
WPP Report
Virat Kohli
Rohit Sharma
Sports Sponsorship
Indian Super League

More Telugu News