Donald Trump: ట్రంప్ హెచ్చరికకు ఇరాన్ కౌంటర్: శత్రుదేశాల నీటి ప్లాంట్లే మా లక్ష్యం!

Iran Counters Trumps Warning Targets Enemy Water Plants
షార్ట్స్‌లో చూడండి
హర్మూజ్ జలసంధిని తెరవాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన 48 గంటల హెచ్చరికలకు ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ దేశంలోని విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తే, పశ్చిమాసియాలోని శత్రుదేశాల మంచినీటి ప్లాంట్లనే లక్ష్యంగా చేసుకుంటామని ఘాటుగా హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్ సైనిక ఉన్నతాధికారులు చేసిన ప్రకటన గల్ఫ్ ప్రాంతంలో కొత్త ఉద్రిక్తతలకు దారితీసింది.

పశ్చిమాసియాలోని సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ వంటి దేశాలు తమ తాగునీటి అవసరాల్లో దాదాపు 90 శాతం సముద్రపు నీటిని శుద్ధి చేసే డీశాలినేషన్ ప్లాంట్లపైనే ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ హెచ్చరికలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ప్లాంట్లపై చిన్న క్షిపణి దాడి జరిగినా కోట్లాది మంది ప్రజలు తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంటారు.

విద్యుత్ ప్లాంట్లతో పోలిస్తే నీటి శుద్ధి కేంద్రాల పునరుద్ధరణ అత్యంత ఖర్చుతో కూడుకున్నది, ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందుకే తమపై దాడి జరిగితే శత్రుదేశాల మనుగడనే దెబ్బతీసేలా ఈ ప్రణాళికను ఇరాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రకటనతో అమెరికాకే కాకుండా, ఆ దేశ మిత్రపక్షాలైన అరబ్ దేశాలకు కూడా ఇరాన్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చింది. దీంతో హర్మూజ్ జలసంధి వివాదం ఇప్పుడు ‘నీటి యుద్ధం’ వైపు మళ్లుతోందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ విధించిన గడువు సమీపిస్తున్న వేళ, ఇరు దేశాల నుంచి వస్తున్న ఇటువంటి కవ్వింపు చర్యలు, ప్రతిస్పందనలు గల్ఫ్‌లో యుద్ధ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి.

Go Back to Shorts
Donald Trump
Iran
US Iran tensions
Middle East conflict
water plants
desalination plants
Saudi Arabia
UAE
Persian Gulf
water crisis

More Telugu News