Jadcherla: జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో దారుణం.. శవాన్ని పీక్కుతిన్న కుక్క

Jadcherla hospital dog eats dead body sparks outrage
  • జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో దారుణ ఘటన
  • మృతదేహాన్ని పీక్కుతిన్న వీధి కుక్క.. వైరలైన వీడియో
  • తాళం చెడిపోవడం వల్లే కుక్క లోపలికి వచ్చిందన్న సూపరింటెండెంట్
  • సిబ్బంది నిర్లక్ష్యంపై మృతుడి కుటుంబసభ్యుల ఆందోళన
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యంత అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మార్చురీ గదిలో ఉంచిన ఓ మృతదేహాన్ని వీధి కుక్క పీక్కుతింటున్న దృశ్యాలు తీవ్ర కలకలం రేపాయి. అధికారుల నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వివరాల్లోకి వెళితే... జడ్చర్ల మండలం నాగసాలకు చెందిన లారీ డ్రైవర్ భీమేశ్వర్ శనివారం నుంచి అదృశ్యమయ్యాడు. సోమవారం స్థానిక చెరువులో అతని మృతదేహం లభించడంతో పోలీసులు దాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అయితే, మార్చురీలో భద్రపరచాల్సిన శవాన్ని సిబ్బంది నేలపైనే ఉంచారు. ఈ క్రమంలో లోపలికి ప్రవేశించిన ఓ వీధి కుక్క, మృతదేహాన్ని పీక్కుతినడం ప్రారంభించింది. ఈ దృశ్యాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది.

ఈ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ స్పందిస్తూ, మార్చురీ గది తాళం చెడిపోయిందని, దాన్ని మరమ్మతు చేయించడానికి సెక్యూరిటీ గార్డు బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని వివరణ ఇచ్చారు. పోస్టుమార్టం కోసం సిబ్బంది లోపలికి వెళ్తున్నప్పుడు వారి వెంటే కుక్క కూడా ప్రవేశించిందని, వెంటనే దాన్ని తరిమేశామని తెలిపారు.

ఈ దారుణ ఘటనపై మృతుడి కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్పందిస్తూ, ఇది అత్యంత బాధాకరమైన విషయమని అన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి, బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. కాగా, జడ్చర్ల ఆసుపత్రిని 100 పడకలకు పెంచినప్పటికీ, కొత్త భవనంలో మార్చురీ సౌకర్యం లేకపోవడంతో పాత గదిలోనే పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
Jadcherla
Jadcherla government hospital
Mahbubnagar district
morgue
dog eats corpse
negligence
postmortem
Anirudh Reddy
Damodar Rajanarasimha
Telangana news

More Telugu News