Sarala Maheshwari: దూరదర్శన్ తొలితరం న్యూస్ రీడర్ సరళా మహేశ్వరి కన్నుమూత

Sarala Maheshwari Doordarshan News Reader Passes Away
  • 71 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచిన సరళా మహేశ్వరి
  • సౌమ్యమైన స్వరంతో కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్న యాంకర్
  • ఆమె మృతితో ఒక స్వర్ణయుగం ముగిసిందన్న ప్రముఖులు
  • దూరదర్శన్‌తో పాటు బీబీసీలోనూ పనిచేసిన సార్లా
భారత టెలివిజన్ రంగంలో సుపరిచితమైన ముఖం, దూరదర్శన్ సీనియర్ న్యూస్ యాంకర్ సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. ఆమె మృతి పట్ల దూరదర్శన్ నేషనల్ చానల్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఆమె సౌమ్యమైన స్వరం, స్పష్టమైన ఉచ్చారణ, వార్తలను హుందాగా అందించే తీరుతో భారతీయ వార్తా ప్రపంచంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని నివాళి అర్పించింది.

"దూరదర్శన్ కుటుంబం తరఫున సరళా మహేశ్వరికి హృదయపూర్వక నివాళులు. ఆమె తన సరళత, హుందాతనంతో వీక్షకులలో చెరగని ముద్ర వేశారు" అని డీడీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. సరళాతో కలిసి పనిచేసిన సీనియర్ యాంకర్ షమ్మీ నారంగ్ కూడా ఆమె మృతిపై విచారం వ్యక్తం చేశారు. "సరళా సౌజన్యానికి, మర్యాదకు ప్రతిరూపం. అపారమైన భాషా పరిజ్ఞానం కలిగిన వ్యక్తి" అని ఆయన పేర్కొన్నారు. ఆమె మృతితో టెలివిజన్ జర్నలిజంలో ఒక స్వర్ణయుగం ముగిసిందని మహిళా కాంగ్రెస్ అభివర్ణించింది.

ఢిల్లీ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్న సమయంలో, 1976లో సరళా మహేశ్వరి దూరదర్శన్‌లో న్యూస్ అనౌన్సర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. భారత టెలివిజన్‌ రంగంలో లైవ్‌లో వార్తలు చదివిన తొలితరం యాంకర్లలో ఆమె ఒకరు. 1984 వరకు డీడీలో పనిచేసి, ఆ తర్వాత యూకే వెళ్లి 1986 వరకు బీబీసీలో న్యూస్ రీడర్‌గా సేవలందించారు. 1988లో తిరిగి భారత్‌కు వచ్చి మళ్లీ దూరదర్శన్‌లో చేరారు. బ్లాక్ అండ్ వైట్, తొలితరం కలర్ టీవీల కాలంలో తన ప్రశాంతమైన, హుందా శైలితో ఆమె ప్రతి ఇంట్లోనూ సుపరిచితమైన, విశ్వసనీయమైన యాంకర్‌గా నిలిచారు.
Sarala Maheshwari
Doordarshan
DD News
News Anchor
Indian Television
Shammi Narang
BBC News
Television Journalism
Delhi University

More Telugu News