అవును, నేను నా భార్యను చంపాను.. కానీ అది మర్డర్ కాదు.. ఆస్ట్రేలియా కోర్టులో ప్రవాస భారతీయుడి వాదన
- భార్యను చంపినట్లు అంగీకరించిన ప్రవాస భారతీయుడు
- అయితే అది మర్డర్ కాదని, మాన్స్లాటర్గా పరిగణించాలని కోర్టులో వాదన
- గత డిసెంబర్లో జరిగిన ఘటనలో భార్య సుప్రియ ఠాకూర్ మృతి
- కీలక ఆధారాల సేకరణ కోసం కేసును ఏప్రిల్కు వాయిదా వేసిన అడిలైడ్ కోర్టు
గత ఏడాది డిసెంబర్ 21న అడిలైడ్లోని నార్త్ఫీల్డ్లో ఉన్న వారి నివాసంలో సుప్రియ అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి చేరుకుని సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. సుప్రియ మృతికి భర్త విక్రాంతే కారణమని నిర్ధారించి, హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ఇటీవల అడిలైడ్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. కస్టడీలో ఉన్న విక్రాంత్ వీడియో లింక్ ద్వారా హాజరయ్యాడు. "నేను మాన్స్లాటర్ (పరిస్థితుల ప్రభావం వల్ల అనుకోకుండా చేసే హత్య)కు అంగీకరిస్తున్నాను, కానీ నేను చేసింది మర్డర్ (ఉద్దేశపూర్వకంగా హత్య చేయడం) మాత్రం కాదు" అని వాదించాడు. అయితే, ప్రాసిక్యూటర్లు ఈ అభ్యర్థనను వెంటనే అంగీకరించలేదు.
ఈ కేసులో పోస్టుమార్టం నివేదిక, డీఎన్ఏ విశ్లేషణ, టాక్సికాలజీ ఫలితాలు వంటి కీలక ఆధారాలు అందాల్సి ఉందని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది. దీంతో తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్కు వాయిదా వేసింది. అప్పటివరకు విక్రాంత్ కస్టడీలోనే కొనసాగనున్నాడు. ఈ కేసు త్వరలో సౌత్ ఆస్ట్రేలియా సుప్రీంకోర్టుకు బదిలీ అయ్యే అవకాశం ఉంది.