S Jaishankar: జైశంకర్, పాకిస్థాన్ స్పీకర్ మధ్య కరచాలనం... ఢాకాలో అనూహ్య దృశ్యం

S Jaishankar and Pakistan Speaker Handshake in Dhaka
షార్ట్స్‌లో చూడండి
భారత్, పాకిస్థాన్ మధ్య గత కొంతకాలంగా నెలకొన్న ఉద్రిక్తతల నడుమ, ఇరు దేశాల ఉన్నతాధికారులు చాలా కాలం తర్వాత ముఖాముఖిగా కలుసుకున్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ సర్దార్ అయాజ్ సాదిఖ్ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఒకరినొకరు పలకరించుకున్నారు. గత మే నెలలో ఇరు దేశాల మధ్య సైనిక ఘర్షణ జరిగిన తర్వాత ఈ స్థాయిలో ఇద్దరు నేతలు ఎదురుపడటం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా బుధవారం జరిగిన అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఇరువురు నేతలు తమ తమ దేశాల ప్రతినిధులుగా ఢాకాకు విచ్చేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ కాంప్లెక్స్‌లో వీరి మధ్య కొద్దిసేపు మాటామంతీ, కరచాలనం చోటుచేసుకుంది. ఇది అధికారిక ద్వైపాక్షిక సమావేశం కాదని స్పష్టమవుతోంది. బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ కార్యాలయం వీరి భేటీకి సంబంధించిన ఫొటోలను అధికారికంగా విడుదల చేసింది.

ఈ భేటీపై పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ సెక్రటేరియట్ ఒక ప్రకటన విడుదల చేసింది. జైశంకరే స్వయంగా స్పీకర్ సాదిఖ్ వద్దకు వచ్చి కరచాలనం చేసి, తనను తాను పరిచయం చేసుకున్నారని ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ పలకరింపుపై భారత విదేశాంగ శాఖ నుంచి ప్రత్యేకంగా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

సుమారు నాలుగు గంటల పర్యటనలో భాగంగా ఢాకాకు వచ్చిన జైశంకర్, ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్‌ను కూడా కలిసి ప్రధాని మోదీ తరఫున సంతాపం తెలియజేశారు. అనంతరం ఆయన చెన్నైకి బయలుదేరి వెళ్లారు.
Go Back to Shorts
S Jaishankar
Jaishankar Pakistan
Pakistan speaker
India Pakistan relations
Ayaz Sadiq
Dhaka meeting
Bangladesh
Khalida Zia funeral
India foreign minister

More Telugu News