Harmanpreet Kaur: శ్రీలంకతో మూడో టీ20... సిరీస్ పై కన్నేసిన భారత మహిళల జట్టు

Harmanpreet Kaur Leads India Women Aiming Series Win vs Sri Lanka
షార్ట్స్‌లో చూడండి
శ్రీలంకతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న మూడో మ్యాచ్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా, ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో రెండు కీలక మార్పులు జరిగాయి. గత మ్యాచ్‌కు స్వల్ప జ్వరం కారణంగా దూరమైన పేసర్ రేణుక సింగ్ ఠాకూర్, ఆల్-రౌండర్ దీప్తి శర్మ తిరిగి జట్టులోకి వచ్చారు. స్నేహ్ రాణా, అరుంధతి రెడ్డిలకు విశ్రాంతి ఇచ్చారు.

టాస్ గెలిచిన అనంతరం హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ, "వాతావరణ పరిస్థితులు, మంచు ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున బౌలింగ్ ఎంచుకున్నాం. సిరీస్ గెలిచే అవకాశం ఉన్న ఈ మ్యాచ్‌లో మా బలాన్ని నమ్ముకుని ముందుకు వెళ్లాలనుకుంటున్నాం. పవర్‌ప్లేలో మరింత దూకుడుగా ఆడాలనే ఉద్దేశంతో రేణుకను తిరిగి జట్టులోకి తీసుకున్నాం" అని వెల్లడించింది.

శ్రీలంక కెప్టెన్ చమరి అటపట్టు మాట్లాడుతూ తాము కూడా టాస్ గెలిస్తే బౌలింగే ఎంచుకునేవాళ్లమని చెప్పింది. తమ జట్టులో మూడు మార్పులు చేశామని, యువ క్రీడాకారిణులకు ఇదొక మంచి అవకాశమని ఆమె పేర్కొంది. ప్రపంచకప్‌కు ముందు జట్టును తీర్చిదిద్దేందుకు ఈ సిరీస్ ఉపయోగపడుతుందని ఆమె అభిప్రాయపడింది.

తుది జట్లు:
భారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, రేణుక సింగ్ ఠాకూర్, శ్రీ చరణి.

శ్రీలంక: చమరి అటపట్టు (కెప్టెన్), హసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, కవిశ దిల్‌హరి, నీలాక్షిక సిల్వ, ఇమేశ దులాని, కౌశాని నుత్యంగన (వికెట్ కీపర్), మల్షా షెహాని, ఇనోక రణవీర, మల్కి మదార, నిమేశ మదుశాని.
Go Back to Shorts
Harmanpreet Kaur
India Women Cricket
Sri Lanka Women Cricket
T20 Series
Renuka Singh Thakur
Chamari Athapaththu
Indian Women's Cricket Team
Trivandrum
Cricket
Womens Cricket

More Telugu News