UPCA: పొగమంచుతో లక్నో టీ20 రద్దు...టికెట్ల డబ్బు రిఫండ్ చేస్తున్న యూపీసీఏ

UPCA Announces Refund for Cancelled Lucknow T20 Tickets
షార్ట్స్‌లో చూడండి
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ దట్టమైన పొగమంచు కారణంగా రద్దవడం తెలిసిందే. లక్నోలోని ఏకానా క్రికెట్ స్టేడియంలో గురువారం రాత్రి జరగాల్సిన ఈ మ్యాచ్‌కు మంచు కారణంగా వెలుతురు సరిగా లేకపోవడంతో అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో, మ్యాచ్ కోసం టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకులకు పూర్తి డబ్బులు తిరిగి ఇస్తామని ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యూపీసీఏ) కార్యదర్శి ప్రేమ్ మనోహర్ గుప్తా స్పష్టం చేశారు.

ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ, "టికెట్ల రిఫండ్ ప్రక్రియ శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమవుతుంది. ఆన్‌లైన్‌లో టికెట్లు కొన్నవారికి ఆన్‌లైన్‌లోనే డబ్బులు వాపస్ వస్తాయి. కేవలం సర్వీస్ ఛార్జీలు మాత్రమే మినహాయించుకొని మిగతా మొత్తం రిఫండ్ చేస్తాం. ఆఫ్‌లైన్‌లో టికెట్లు కొన్నవారి కోసం ఏకానా స్టేడియంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. దీనికి సంబంధించి వార్తాపత్రికల్లో న ప్రకటన కూడా ఇస్తాం" అని వివరించారు.

గురువారం రాత్రి అంపైర్లు కేఎన్ అనంతపద్మనాభన్, రోహన్ పండిట్ మైదానాన్ని పలుమార్లు పరిశీలించిన అనంతరం,  పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో, మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.  ఈ నేపథ్యంలో గుప్తా స్పందిస్తూ "మ్యాచ్ జరగనందుకు చాలా చింతిస్తున్నాం. ఎంతో ఆశతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. వారి సమయం వృధా అయినందుకు క్షమాపణలు కోరుతున్నాం" అని గుప్తా అన్నారు.

సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. చివరిదైన ఐదో టీ20 మ్యాచ్ శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.
Go Back to Shorts
UPCA
Lucknow T20
India vs South Africa
Ekana Cricket Stadium
Prem Manohar Gupta
T20 Match Refund
Cricket Tickets
Suryakumar Yadav
Narendra Modi Stadium
Ahmedabad T20

More Telugu News