కెప్టెన్ పని టాస్ వేయడమే కాదు: సూర్యపై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు
- పరుగులు చేయడం కూడా కెప్టెన్ బాధ్యతేనని స్పష్టీకరణ
- సూర్యతో పాటు వైస్ కెప్టెన్ గిల్ ఫామ్ కూడా ఆందోళనకరమేనన్న చోప్రా
- ప్రపంచకప్కు ముందు వీరిద్దరూ ఫామ్ అందుకోవడం అత్యవసరమని సూచన
తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ, "మీరు జట్టుకు కెప్టెన్. కానీ కెప్టెన్సీ అంటే టాస్ వేయడం, వ్యూహాలు రచించడం మాత్రమే కాదు. టాప్-4లో బ్యాటింగ్ చేసేటప్పుడు పరుగులు చేయడం మీ ప్రధాన కర్తవ్యం. చాలా మ్యాచ్లు గడిచిపోయాయి. గత 17 ఇన్నింగ్స్లలో మీ సగటు 14 మాత్రమే. ఒక్క అర్ధ సెంచరీ కూడా లేదు. ఇది ఆందోళన కలిగించే విషయం" అని చోప్రా తెలిపాడు.
సూర్యకుమార్తో పాటు వైస్-కెప్టెన్ శుభ్మన్ గిల్ ఫామ్ కూడా జట్టుకు పెద్ద తలనొప్పిగా మారిందని ఆకాశ్ చోప్రా ఆందోళన వ్యక్తం చేశాడు. "కెప్టెన్, వైస్-కెప్టెన్ ఇద్దరూ పరుగులు చేయకపోతే, ప్రపంచకప్ బరిలోకి దిగేటప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉండలేరు. వీరిద్దరూ రాణించడం జట్టుకు అత్యవసరం" అని అభిప్రాయపడ్డాడు.
2024 ప్రపంచకప్ తర్వాత సూర్యకుమార్ 26 ఇన్నింగ్స్లలో 18.73 సగటుతో 431 పరుగులు చేయగా, గిల్ 14 ఇన్నింగ్స్లలో 23.90 సగటుతో 263 పరుగులు మాత్రమే చేశాడు. వీరిద్దరి వైఫల్యం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో జట్టు ఓటమికి కారణమైంది. 2026 ప్రపంచకప్కు ముందు కేవలం ఎనిమిది మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నందున, ఈ ఇద్దరు స్టార్ బ్యాటర్లు త్వరగా ఫామ్ అందుకోవాలని జట్టు యాజమాన్యం కోరుకుంటోంది.