బీహార్ ప్రజలు కులాలు పక్కన పెట్టి అభివృద్ధికి పట్టం కట్టారు: జీవీఎల్ నరసింహారావు
- బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం
- 200కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళుతున్న కూటమి
- ఇది డబుల్ ఇంజన్ సర్కార్ పాలనకు ప్రజల మద్దతు అన్న జీవీఎల్
- అభివృద్ధికి, సుపరిపాలనకే మహిళలు ఓటు వేశారని విశ్లేషణ
- కుల సమీకరణాలను ప్రజలు తిరస్కరించారని వ్యాఖ్య
ఈ ఫలితాలపై బీజేపీ నేత, ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ఇది ప్రజలు ఇచ్చిన సానుకూల తీర్పు అని, డబుల్ ఇంజన్ సర్కార్ సమర్థవంతమైన పాలనకు లభించిన మద్దతు అని ఆయన పేర్కొన్నారు. బీహార్ ప్రజలు కుల సమీకరణాలను పక్కనపెట్టి అభివృద్ధికి పట్టం కట్టారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసిన ప్రచారం, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధికి ప్రజలు ఓటు వేశారని తెలిపారు.
ఈ ఎన్నికల్లో మహిళలు బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారని జీవీఎల్ ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. "పురుషుల్లో ఉండే కులభావనలు మహిళల్లో ఉండవు. వారు అభివృద్ధి, సుపరిపాలనకే ప్రాధాన్యత ఇచ్చి ఓటు వేశారు" అని వివరించారు. ఓట్ల చోరీ పేరుతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదని, బీహార్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దిగజారిపోయిందని ఆయన విమర్శించారు.