పాకిస్థాన్ క్రికెట్లో గందరగోళం.. మళ్లీ మారిన వన్డే కెప్టెన్
- పాక్ వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి మహమ్మద్ రిజ్వాన్పై వేటు
- కొత్త సారథిగా స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది నియామకం
- దక్షిణాఫ్రికాతో సిరీస్కు ముందు పీసీబీ కీలక నిర్ణయం
- ఇటీవల కాలంలో తరచూ కెప్టెన్లను మారుస్తున్న పాక్ బోర్డు
- 2027 ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకొని ఈ మార్పులు చేసినట్టు వెల్లడి
ఇస్లామాబాద్లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు పీసీబీ తెలిపింది. ఈ సమావేశంలో వైట్ బాల్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్, హై పర్ఫార్మెన్స్ డైరెక్టర్ ఆకిబ్ జావేద్, సెలక్షన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 2027 ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. నవంబర్ 4 నుంచి 8 వరకు ఫైసలాబాద్లోని ఇక్బాల్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో పాకిస్థాన్ వన్డే సిరీస్ ఆడనుంది.
ఇటీవల కాలంలో పీసీబీ తరచూ కెప్టెన్లను మార్చడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభంలోనే షాహీన్ను టీ20 కెప్టెన్గా నియమించి, ఒకే సిరీస్ తర్వాత తప్పించి మళ్లీ బాబర్కు పగ్గాలు అప్పగించారు. ఆ తర్వాత కొన్ని నెలలకే రిజ్వాన్ను వన్డే కెప్టెన్గా నియమించారు. ఇప్పుడు మళ్లీ అతడిని తొలగించి షాహీన్ను ఎంపిక చేయడం గమనార్హం. రిజ్వాన్ సారథ్యంలో పాకిస్థాన్ 20 వన్డేలు ఆడగా, 9 విజయాలు, 11 ఓటములు చవిచూసింది.
25 ఏళ్ల షాహీన్ అఫ్రిది పాకిస్థాన్ ప్రధాన బౌలర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 66 వన్డేలు, 92 టీ20లు, 32 టెస్టులు ఆడి అన్ని ఫార్మాట్లలో కలిపి 400కు పైగా వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు కెప్టెన్సీ అదనపు బాధ్యతలతో పాటు, ప్రధాన బౌలర్గా అతను జట్టును ఎలా నడిపిస్తాడనే విషయం ఆసక్తికరంగా మారింది.