దేశంలో రైలు ప్రయాణికులకు శుభవార్త
- దేశవ్యాప్తంగా 200 కొత్త రైళ్లు
- వీటిలో 50 నమో భారత్, 100 మెమూ, 50 అమృత్ భారత్ రైళ్లు
- కాజీపేటలో 100కు పైగా మెమూ రైళ్ల తయారీ
- పాత మెమూ రైళ్లలో కోచ్ల సంఖ్య పెంపు నిర్ణయం
అంతకుముందు, హర్యానాలోని మనేసర్లో దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ గతి శక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్ను అశ్వినీ వైష్ణవ్ మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు రైల్వే శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న మెమూ రైళ్లలో కోచ్ల సంఖ్యను 8-12 నుంచి 16-20కి పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయంతో తక్కువ దూరాలకు ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మంత్రి వివరించారు.
ముఖ్యంగా, తెలంగాణలోని కాజీపేటలో కొత్తగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశామని, అక్కడ 100కు పైగా మెమూ రైళ్ల తయారీ జరుగుతోందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. దీంతో పాటు, కొత్తగా 50 నమో భారత్ రైళ్లను కూడా తయారు చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
ప్రయాణికుల రవాణాతో పాటు, సరుకు రవాణాలో కూడా భారతీయ రైల్వేలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి కొనియాడారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వేలు సుమారు 720 కోట్ల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చాయని, అలాగే 1617 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసిందని ఆయన వివరించారు. ఈ గణాంకాలు రైల్వేల సామర్థ్యానికి నిదర్శనమని అన్నారు. కొత్త రైళ్ల రాకతో ప్రయాణికుల సేవలు మరింత మెరుగుపడతాయని రైల్వే అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఈ నూతన రైలు సర్వీసులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి, ఏయే మార్గాల్లో, ఏయే స్టేషన్ల మీదుగా నడుస్తాయన్న వివరాలను రైల్వే మంత్రిత్వ శాఖ ఇంకా వెల్లడించలేదు. ఈ వివరాలు త్వరలోనే ప్రకటిస్తారని ప్రయాణికులు ఆశిస్తున్నారు.