హనీమూన్ జంట మిస్సింగ్: ఫోన్ లో సోనమ్ చివరిగా అత్తగారితో మాట్లాడిన మాటలు ఇవే!
- మేఘాలయ హనీమూన్లో ఇండోర్ యువకుడి దారుణ హత్య
- వైసాడాంగ్ జలపాతం వద్ద లోయలో రాజా రఘువంశీ మృతదేహం
- వేటకత్తితో దాడి చేసి చంపినట్లు పోలీసుల నిర్ధారణ
- భార్య సోనమ్ అదృశ్యం, కొనసాగుతున్న గాలింపు చర్యలు
- సీబీఐ దర్యాప్తు, ఆర్మీ సహాయం కోరుతున్న మృతుడి కుటుంబం
- దోపిడీ లేదా పాత కక్షలే కారణమా? పోలీసుల విచారణ
ఇండోర్కు చెందిన నవ దంపతులు రాజా రఘువంశీ, సోనమ్ మే 23న హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. అదే రోజు వారి ఆచూకీ తెలియరాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, జూన్ 2న వైసాడాంగ్ జలపాతం వద్ద లోయలో రాజా మృతదేహం కుళ్లిన స్థితిలో లభ్యమైంది.
దంపతులు అదృశ్యం కావడానికి కొద్దిసేపటి ముందు సోనమ్తో చివరిసారిగా మాట్లాడిన విషయాన్ని రాజా తల్లి కన్నీటిపర్యంతమవుతూ గుర్తుచేసుకున్నారు. "మే 23న ఏకాదశి. కోడలు ఉపవాసం ఉంటుందని తెలుసు. ఎలా ఉందో కనుక్కుందామని ఫోన్ చేశాను. నడక ప్రయాణంలో ఉన్నారు కదా, ఏదైనా తినమని చెప్పాను. దానికి సోనమ్, 'విహారయాత్రకు వచ్చానని ఉపవాసం ఎలా మానేస్తాను అత్తయ్యా' అంది. అడవిలో ఒక జలపాతం చూడటానికి ట్రెక్కింగ్ చేస్తున్నామని, కాస్త ఆయాసంగా అనిపిస్తోందని, తర్వాత కాల్ చేస్తానని చెప్పింది. ఆ తర్వాత వాళ్ల నుంచి ఎలాంటి ఫోన్ రాలేదు" అని ఆమె విలపించారు. ఈ సంభాషణకు సంబంధించిన రికార్డింగ్ను కుటుంబ సభ్యులు పోలీసులతో పంచుకున్నారు.