Advertisement

30 వేల మంది జవాన్లు రాజీనామా చేశారా?.. వైరల్ వీడియోపై కేంద్రం క్లారిటీ

Center clarifies on viral video claiming thirty thousand soldiers resigned
  • సీడీఎస్ జనరల్ రాజా సుబ్రమణి పేరు మీదుగా సోషల్ మీడియాలో వైరల్ వీడియో
  • అది పూర్తిగా నకిలీదని స్పష్టం చేసిన కేంద్రం
  • పాకిస్థాన్‌కు చెందిన ప్రచార ఖాతాలు ఏఐ సాయంతో సృష్టించాయని వెల్లడి
  • జంతర్‌మంతర్ నిరసనల నేపథ్యంలో 30 వేల మంది భారత సైనికులు రాజీనామా చేసినట్లు అవాస్తవాల ప్రచారం
జంతర్‌మంతర్ విద్యార్థుల నిరసనలకు సంబంధించి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ ఎన్‌.ఎస్‌. రాజా సుబ్రమణి చేసినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పూర్తిగా నకిలీదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వీడియోను పాకిస్థాన్‌కు చెందిన ప్రచార ఖాతాలు కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో సృష్టించి తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నాయని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది.

వైరల్ వీడియోలో జంతర్‌మంతర్ నిరసనల నేపథ్యంలో 30 వేల మంది భారత సైనికులు రాజీనామా చేశారని, కేంద్ర ప్రభుత్వం విద్యార్థులపై సానుకూలంగా స్పందించాలని సీడీఎస్ వ్యాఖ్యానించినట్లు చూపించారు. అయితే జనరల్ రాజా సుబ్రమణి అలాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ చేయలేదని, వీడియో పూర్తిగా ఏఐతో రూపొందించినదేనని పీఐబీ స్పష్టం చేసింది.

దీనికి సంబంధించిన అసలు వీడియోను కూడా పీఐబీ విడుదల చేసింది. అందులో సీడీఎస్ ఇండియన్‌ ఆయిల్ దురాండ్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు ప్రజలను ఆహ్వానిస్తూ మాట్లాడిన దృశ్యాలే ఉన్నాయని తెలిపింది. ఆ వీడియోకు ఎలాంటి సంబంధం లేకుండా తప్పుడు ఆడియో జతచేసి వైరల్ చేశారని పేర్కొంది.

ప్రజలు సోషల్ మీడియాలో కనిపించే ఇలాంటి వీడియోలను వెంటనే నమ్మొద్దని, అధికారిక వర్గాల ద్వారా మాత్రమే సమాచారాన్ని ధ్రువీకరించుకోవాలని పీఐబీ సూచించింది. అనుమానాస్పద ప్రభుత్వ సంబంధిత కంటెంట్ కనిపిస్తే పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌కు ఫిర్యాదు చేయాలని కోరింది.
Advertisement
General Raja Subramani
Indian Army
PIB Fact Check
AI Fake Video
Soldier Resignation News
Pakistan Propaganda

More Telugu News