భారత్ గురించి తప్పుడు ప్రచారం చేసిన షాహిద్ ఆఫ్రిదీని సత్కరించిన పాకిస్థాన్ ప్రధాని
- పాక్ ప్రధాని అధికారిక నివాసంలో సమావేశం
- భారత్ పై పాక్ సైన్యం విజయం సాధించిందన్న ఆఫ్రిది
- ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైనప్పటి నుంచి భారత్ పై తప్పుడు ప్రచారం చేస్తున్న ఆఫ్రిది
పాకిస్థాన్ సైన్యం చేపట్టినట్లు చెబుతున్న 'ఆపరేషన్ బన్యానమ్ మర్సూస్' విజయవంతం కావడం పట్ల ఈ సమావేశంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్లను ఆఫ్రిది, అక్తర్లు అభినందించినట్లు సమాచారం. ఈ సందర్భంగా షాహిద్ ఆఫ్రిది మాట్లాడుతూ, పాకిస్థాన్ సైన్యం పనితీరును కొనియాడాడు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలో ప్రజలంతా ఏకతాటిపై నిలిచి, శత్రువుకు గట్టి సమాధానం ఇచ్చారని ప్రశంసించాడు. ఆఫ్రిది వ్యాఖ్యలకు ప్రధాని షెహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. పాకిస్థాన్ సైన్యానికి మద్దతుగా నిలవడమే కాకుండా, విజయ గర్జన పేరుతో ర్యాలీ నిర్వహించినందుకు ఆఫ్రిదీని ఆయన ప్రశంసించారు. అనంతరం, షాహిద్ ఆఫ్రిదీని ప్రధాని షరీఫ్ సత్కరించారు.
మరోవైపు, మనం ఆపరేషన్ సిందూర్ ను ప్రారంభించిన తర్వాత షాహిద్ ఆఫ్రిది భారత్పై తీవ్ర విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు. పాకిస్థాన్ సైన్యం భారత్పై విజయం సాధించిందంటూ కరాచీలో ఒక విక్టరీ ర్యాలీ కూడా నిర్వహించాడు. ఈ సందర్భంగా భారత సైన్యం మసీదులు, ప్రజలపై దాడులు చేస్తోందని, విదేశాల్లో సిక్కు కార్యకర్తలపై మోదీ ప్రభుత్వం దాడులు చేయిస్తోందని ఆరోపించాడు.