గుల్జార్ హౌస్ మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
- హైదరాబాద్ ఓల్డ్ సిటీ గుల్జార్హౌజ్లో ఘోర అగ్ని ప్రమాదం
- ప్రమాదంలో 17 మంది మృతి పట్ల సీఎం తీవ్ర విచారం
- విచారణకు ఆదేశం, కారణాలపై ఆరా
- మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటన
ప్రమాద వార్త తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుటాహుటిన స్పందించారు. అగ్నిమాపక, పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి, సహాయక చర్యల పురోగతిని ఎప్పటికప్పుడు ఆరా తీశారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలను వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ప్రమాదానికి గల కారణాలను లోతుగా దర్యాప్తు చేయాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన నివారణ చర్యలు చేపట్టాలని, ప్రజల్లో భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.
క్షతగాత్రులకు అందుతున్న వైద్య సహాయంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. అందుబాటులో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించాలని, బాధితులకు అన్ని విధాలా అండగా నిలవాలని సూచించారు. కొందరు బాధితుల కుటుంబ సభ్యులతో నేరుగా ఫోన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి, వారికి ధైర్యం చెప్పి, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
ఈ ప్రమాదంలో అగ్నిమాపక సిబ్బంది చూపిన ధైర్యసాహసాలను ముఖ్యమంత్రి ప్రశంసించారు. ప్రాణాలకు తెగించి మంటల్లో చిక్కుకున్న సుమారు 40 మందిని వారు సురక్షితంగా కాపాడగలిగారని తెలిపారు. వారి సకాల స్పందన వల్ల మరిన్ని ప్రాణ నష్టం జరగకుండా నివారించగలిగామని అన్నారు. ప్రభుత్వం బాధితులందరికీ అండగా ఉంటుందని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.