Roja: పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్‌పై రోజా ఫైర్

Roja Fires Over PSR Anjaneyulus Arrest
షార్ట్స్‌లో చూడండి
మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్‌పై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రస్థాయిలో స్పందించారు. ఇది పూర్తిగా కూటమి ప్రభుత్వ డైవర్షన్ పాలిటిక్స్ అని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి అరెస్టులకు పాల్పడుతున్నారని ఆమె మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు.

పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టును 'డర్టీ డైవర్షన్ పాలిటిక్స్'గా అభివర్ణించిన రోజా, ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. "ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చారు. మెగా డీఎస్సీపై తొలి సంతకం పెట్టిన చంద్రబాబు, ఇప్పటివరకు దాన్ని ఎందుకు అమలు చేయలేదు? ఆ సంతకం చిత్తు కాగితంతో సమానమా?" అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. హామీలు నెరవేర్చలేని నిస్సహాయతతోనే, ఎదురుదాడి చేసేందుకు, భయభ్రాంతులకు గురిచేసేందుకు వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఇలాంటి వాటికి ఎవరూ భయపడరని స్పష్టం చేశారు.

ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితో ఉంటే, గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపిస్తున్న ఫైబర్‌ నెట్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కామ్‌లపై విచారణ జరిపించాలని రోజా సవాల్ విసిరారు. అమరావతి టెండర్ల వ్యయాన్ని రూ.36 వేల కోట్ల నుంచి రూ.77 వేల కోట్లకు ఎందుకు పెంచారని నిలదీశారు. ఇది కేవలం దోపిడీకి సిద్ధమవ్వడమేనని, దీనిపై ప్రధాని మోదీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గతంలో చంద్రబాబు రాష్ట్రాన్ని ఏటీఎంలా వాడుకుంటున్నారని స్వయంగా ప్రధాని అన్న మాటలను ఆమె గుర్తు చేశారు.

టీటీడీ గోశాలలో వందలాది ఆవులు, శ్రీకూర్మంలో తాబేళ్లు చనిపోయిన ఘటనలపై పవన్ కళ్యాణ్ మౌనం వహించడాన్ని రోజా తప్పుబట్టారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్, ఈ ఘటనలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేవలం చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడటమే పవన్ పని అని, ప్రజా సమస్యలను పట్టించుకోరని విమర్శించారు.

వైసీపీ హయాంలో మద్యం దుకాణాలు తగ్గిస్తే, టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు వాటిని పెంచుతూ లంచాలు దండుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ఎంపీ మిథున్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మద్యం పాలసీతో ముడిపెట్టి కేసులు పెట్టాలని చూస్తున్నారని అన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకుని, ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెట్టాలని రోజా హితవు పలికారు. అక్రమ కేసులతో వైసీపీ నేతల స్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆమె హెచ్చరించారు.
Go Back to Shorts
Roja
PSR Anjaneyulu
Arrest
Andhra Pradesh Politics
TDP
YSRCP
Diversion Politics
Chandrababu Naidu
Pawan Kalyan
Corruption Allegations

More Telugu News