Nara Lokesh: కోటిమంది కార్యకర్తల బీమాకు అవగాహన ఒప్పందం: మంత్రి నారా లోకేశ్‌

MoU Signed for Insurance of One Crore TDP Activists says Minister Nara Lokesh
  • యునైటెడ్ ఇండియాతో పార్టీ తరపున లోకేశ్‌ ఎంఓయూ
  • జనవరి 1 నుంచే ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా ఒప్పందం
  • కోటిమంది కార్యకర్తల బీమా కోసం తొలివిడతలో రూ.42 కోట్లు చెల్లించిన పార్టీ
  • ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు రూ.5లక్షల ప్రమాద బీమా
ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. మరికొన్ని రోజుల్లో సభ్యత్వ నమోదు చారిత్రాత్మక మైలురాయిని చేరుకోబోతున్న నేపథ్యంలో కోటిమంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేలా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఇన్సూరెన్స్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. 

ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈమేరకు మంత్రి లోకేశ్‌, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్, ప్రాగ్మ్యాటిక్ ఇన్స్యూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. కోటిమంది కార్యకర్తల కోసం ఒకేమారు ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలో ఇదే ప్రథమం. ఒప్పందం ప్రకారం 2025 జనవరి 1 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు కోటిమంది కార్యకర్తల బీమా కోసం తొలివిడతలో రూ.42 కోట్లు పార్టీ చెల్లించింది. వచ్చే ఏడాది కూడా దాదాపు ఇదే మొత్తంలో ప్రీమియం సొమ్మును పార్టీనే చెల్లిస్తుంది. 

ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు రూ.5లక్షల ప్రమాద బీమా లభిస్తుంది. కార్యకర్తల సంక్షేమనిధి సారధిగా యువనేత నారా లోకేశ్‌ బాధ్యతలు చేపట్టాక కేడర్ సంక్షేమమే లక్ష్యంగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. కార్యకర్తల సంక్షేమానికి ఇప్పటి వరకూ రూ.138 కోట్లు ఖర్చుచేశారు. గత ప్రభుత్వంలో కేసుల్లో ఇరుక్కున్న కేడర్ కోసం న్యాయవిభాగాన్ని ఏర్పాటు చేశారు. 

వివిధ ప్రమాదాల్లో దెబ్బతిన్న కార్యకర్తలను ఆదుకునేందుకు కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేశారు. మృతిచెందిన కార్యకర్తల పిల్లల కోసం హైదరాబాద్‌తో పాటు కృష్ణా జిల్లా చల్లపల్లిలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేసి ఉచితంగా విద్యనందిస్తున్నారు. కుటుంబసభ్యుల మాదిరి పార్టీ కేడర్ ను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు లోకేశ్‌ చేస్తున్న కృషిపై కార్యకర్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Nara Lokesh
Insurance
TDP Activists
Andhra Pradesh
TDP

More Telugu News