అందుకే గ్యారీ కిర్స్టన్పై వేటు: మాజీ క్రికెటర్ బాసిత్ అలీ
- మహ్మద్ రిజ్వాన్ను కెప్టెన్గా చేయడం కిర్స్టన్కు ఇష్టంలేదన్న బాసిత్ అలీ
- సారథిగా వేరే ఆటగాడి పేరును కిర్స్టన్ సూచించాడన్న మాజీ క్రికెటర్
- కానీ, ప్రస్తుతం పీసీబీ ఛైర్మన్ చాలా శక్తిమంతమైన వ్యక్తి అని పేర్కొన్న అలీ
- ఆయన నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించలేరని వ్యాఖ్య
- అందుకే కిర్స్టన్ జాబ్ పోయిందన్న బాసిత్ అలీ
అటువంటి నిర్ణయాలకు తనకు పూర్తి అధికారం ఉందని గ్యారీ కిర్స్టన్ విశ్వసించాడని మాజీ క్రికెటర్ తెలిపాడు. కానీ, ప్రస్తుతం పీసీబీ ఛైర్మన్ మోస్సిన్ నఖ్వీ చాలా శక్తిమంతమైన వ్యక్తి, ఆయన నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించలేరన్నాడు. అందుకే కిర్స్టన్ జాబ్ పోయిందని బాసిత్ అలీ పేర్కొన్నాడు.
"ఇదంతా రిజ్వాన్ను కెప్టెన్గా ఎంపిక చేయడంతోనే ప్రారంభమైంది. కిర్స్టన్ వేరే ఆటగాడు నాయకత్వం వహించాలని కోరుకున్నాడు. అతను ప్రస్తుత జట్టులో లేని వ్యక్తి. ఇలాంటి నిర్ణయాల్లో తనకు పూర్తి అధికారం ఉందని అతను భావించాడు. కానీ మన దగ్గర పీసీబీ ఛైర్మన్ మోస్సిన్ నఖ్వీ ప్రస్తుతం చాలా శక్తిమంతమైన వ్యక్తి అని అతను గుర్తించలేకపోయాడు. రాత్రికి రాత్రే ఉద్యోగం పోయింది" అని బాసిత్ అలీ తన యూట్యూబ్ ఛానెల్లో తెలిపాడు.
ఇక ఆస్ట్రేలియా, జింబాబ్వే సిరీస్లకు పీసీబీ తాజాగా జట్టులను ప్రకటించింది. ఈ సందర్భంగా బాబర్ ఆజం స్థానంలో మహ్మద్ రిజ్వాన్ కు పాకిస్థాన్ కెప్టెన్గా బాధ్యతలు అప్పగించింది. అలాగే సల్మాన్ అలీ అఘాను వైస్ కెప్టెన్గా నియమించింది.
కాగా, రిజ్వాన్ నియామకం జరిగిన 24 గంటల్లోనే పీసీబీ కిర్స్టన్ రాజీనామాను ధ్రువీకరించడం గమనార్హం. ఒక్క వన్డే మ్యాచ్కు కూడా పాకిస్థాన్కు కోచ్గా వ్యవహరించకుండానే ఆయన ఆరు నెలల పదవీకాలం ముగిసింది. వెస్టిండీస్, అమెరికాలో జరిగిన టీ20 ప్రపంచ కప్ 2024లో కిర్స్టన్ కోచ్గా ఉన్నాడు. కానీ, ఈ ఈవెంట్లో పాకిస్థాన్ జట్టు ఘోరంగా విఫలమైంది. భారత్, యూఎస్ఏ చేతిలో ఓటమి తర్వాత గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టింది.