బాబర్ టెస్టుల్లో రాణించాలంటే అదొక్కటే మార్గం.. పాక్ స్టార్ ప్లేయర్కు సెహ్వాగ్ కీలక సూచన!
- దేశవాళీ క్రికెట్ ఆడాలని బాబర్ కు సెహ్వాగ్ సలహా
- ఫిట్నెస్పై కూడా దృష్టి పెట్టాలని సూచన
- కుటుంబంతో కూడా కొంత సమయం గడపాలన్న వీరూ
- దృఢమైన ఆటగాడిగా అంతర్జాతీయ క్రికెట్కు తిరిగి రావాలని సలహా
ఈ క్రమంలో బాబర్ ఆజంకు టెస్టుల్లో పునరాగమనం చేసేందుకు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒక కీలక సూచన చేశాడు. దేశవాళీ క్రికెట్ ఆడాలని అతనికి సలహా ఇచ్చాడు. అలాగే ఫిట్నెస్పై కూడా దృష్టి పెట్టాలని సూచించాడు.
"బాబర్ ఆజం ఇప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడాలి. అతను తన ఫిట్నెస్పై దృష్టిసారించాలి. కుటుంబంతో కొంత సమయం గడపాలి. ఆపై శారీరకంగా, మానసికంగా దృఢమైన ఆటగాడిగా అంతర్జాతీయ క్రికెట్కు తిరిగి రావాలి" అని పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ యూట్యూబ్ ఛానెల్లో సెహ్వాగ్ అన్నాడు.
సెహ్వాగ్ ఇంకా మాట్లాడుతూ.. ఈ క్లిష్ట సమయంలో బాబర్ మానసికంగా దృఢంగా ఉండాల్సి అవసరం ఉందన్నాడు. అది అతనికి త్వరగా తన మునుపటి ఫామ్ను అందుకోవడానికి సహాయపడుతుందని తెలిపాడు.
"బాబర్ మునుపటిలా అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోవడం, కెప్టెన్సీకి రాజీనామా చేయడంతో అతను టెక్నిక్ పరంగా కంటే మానసికంగా ఎక్కువగా ప్రభావితమైనట్లు కనిపిస్తోంది. అతను మానసికంగా దృఢంగా ఉండాలి. బాబర్ ప్రతిభావంతుడైన ఆటగాడు. అతనిలాంటి ఆటగాళ్లు త్వరగా పుంజుకుంటారు" అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
ఏడాది కాలంగా పేలవమైన టెస్ట్ ఫామ్తో బాబర్ ఇక్కట్లు
2022 డిసెంబరు 26న కరాచీ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మొదటి టెస్టులో చివరి సారిగా శతకం (161) సాధించాడు బాబర్. ఆ తర్వాత అతను 18 ఇన్నింగ్స్లలో కనీసం ఒక్క అర్ధ సెంచరీ కూడా నమోదు చేయలేదు. దీనిని బట్టి చూస్తే, ఈ స్టార్ ప్లేయర్ టెస్టుల్లో ఎంత ఘోరంగా విఫలం అవుతున్నాడో అర్థమవుతోంది. తాజాగా ముల్తాన్లో ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ ఇన్నింగ్స్ మరియు 47 పరుగుల తేడాతో భారీ ఓటమికి గురైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లలో బాబర్ 30, 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.
దాంతో రెండో టెస్టులో పీసీబీ అతని స్థానంలో కమ్రాన్ గులామ్ అనే కొత్త ఆటగాడిని జట్టులోకి తీసుకుంది. అతను అరంగేట్రంలో సెంచరీ (118) తో అదరగొట్టాడు. ఈ మ్యాచ్లో అద్భుతంగా పుంజుకున్న పాకిస్థాన్ ఏకంగా 152 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్వదేశంలో 11 మ్యాచ్ల సుదీర్ఘ పరాజయాల పరంపరకు తెరదించింది. షాన్ మసూద్ సారథ్యంలోని పాక్ చివరి టెస్టులో కూడా గెలిచి ఇంగ్లండ్పై చారిత్రాత్మక సిరీస్ విజయాన్ని నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతోంది.