Telugudesam: ఏపీ ఎన్నికల బరిలో నేతల వారసులు, బంధువులు!

TDP leaders relatives and children participate in upcoming elections
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థులను టీడీపీ తాజాగా ప్రకటించింది. అయితే, ఈసారి ఎన్నికల్లో పలువురు టీడీపీ నేతల వారసులు, బంధువులు కూడా బరిలో ఉన్నారు. దాదాపు 20 మంది వరకూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగనున్నారు. వీరిలో కొందరు తొలిసారి ఎన్నికలను ఎదుర్కొంటుండగా మరికొందరికి గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉంది

 తొలిసారి పోటీ చేయబోయేది వీరే!
  • కొండపల్లి శ్రీనివాస్ (గజపతినగరం): ఈయన దివంగత కొండపల్లి పైడితల్లినాయుడి మనవడు. గజపతినగరం మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడికి సోదరుడి కుమారుడు. శ్రీనివాస్ తండ్రి కొండలరావు గతంలో గంట్యాడ ఎంపీపీగా పనిచేశారు. 
  • టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడి కుమార్తె యనమల దివ్య (తుని). తుని టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. 
  • ఆదిరెడ్డి వాసు (రాజమహేంద్రవరం నగరం): మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తనయుడు. ప్రస్తుత ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడికి సొంత బావ.
  • బడేటి రాధాకృష్ణ (ఏలూరు): దివంగత మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు సోదరుడు. ఏలూరు టీడీపీ ఇన్‌చార్జ్‌ గా ఉన్నారు. 
  • వర్ల కుమార్ రాజా(పామర్రు): టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తనయుడు. 
  • నెలవల విజయశ్రీ (సూళ్లూరుపేట): మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రమణ్యం కుమార్తె. తిరుపతిలో వైద్యురాలు. 
  • రెడ్డప్పగారి మాధవి (కడప): మాజీ మంత్రి ఎంపీ రామచంద్రారెడ్డి కుమార్తె. తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 
  • ఎస్.సవిత (పెనుగొండ): మాజీ మంత్రి, మాజీ ఎంపీ రామచంద్రారెడ్డి కుమార్తె. ఆ వారసత్యంతో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 
  • ఎంఈ సునీల్‌కుమార్ (మడకశిర): మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు.

ఎన్నికల అనుభవం ఉన్నవారు
  • బేబినాయన (ఆర్‌వీఎస్‌కేకే రంగారావు) బొబ్బిలి: ఈయన మాజీ మంత్రి సుజయ్ కృష్ణరంగారావుకు సోదరుడు. 2014 ఎన్నికల్లో విజయనగరంలో  ఓడిపోయిన ఆయన మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 
  • అదితి విజయలక్ష్మి గజపతిరాజు (విజయనగరం) సీనియర్ నేత అశోక్‌గజపతిరాజు కుమార్తె. 2019లో విజయనగరం అసెంబ్లీ సీటుకు పోటీ చేసి ఓటమి చవిచూశారు. మళ్లీ అదే స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు. 
  • కాగిత కృష్ణప్రసాద్ (పెడన): దివంగత మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు తనయుడు. పెడన నుంచి 2019లో టీడీపీ అబ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి అక్కడి నుంచే పోటీ చేయనున్నారు.
  • తంగిరాల సౌమ్య (నందిగామ) మాజీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్‌రావు కుమార్తె. ఆయన మరణానంతరం 2014లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2019లో నందిగామ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా మూడోసారి బరిలోకి దిగతున్నారు. 
  • నారాలోకేశ్ (మంగళగిరి): టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు. ఎమ్మెల్సీగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2019లో మంగళగిరిలో ఓడిపోయారు. మరోసారి అక్కడి నుంచే బరిలోకి దిగుతున్నారు.
  • భూమా అఖిలప్రియ (ఆళ్లగడ్డ): దివంగత మాజీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, శోభనాగిరెడ్డి దంపతుల కుమార్తె. 2014లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.. 2019లో ఆళ్లగడ్డలో ఓడిపోయిన ఆమె మళ్లీ అక్కడి నుంచే బరిలోకి దిగుతున్నారు. 
  • టీజీ భరత్ (కర్నూలు): మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ తనయుడు. 2019లో కర్నూలులో పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ అక్కడి నుంచి బరిలోకి దిగనున్నారు.
  • కేఈ శ్యాంబాబు (పత్తికొండ): మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తనయుడు. గత ఎన్నికల్లో ఓడిపోయినా మరోసారి పత్తికొండ నుంచే బరిలోకి దిగుతున్నారు.
  • జేసీ అస్మిత్ రెడ్డి (తాడిపత్రి): మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు. 2019లో తాడిపత్రిలో ఓడిపోయారు. మళ్లీ ఈసారి అక్కడి నుంచే బరిలోకి దిగుతున్నారు. 
  • నల్లారి కిశోర్‌కుమార్ రెడ్డి (పీలేరు): మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సోదరుడు. 2014 ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ తరపున బరిలోకి దిగి ఓడిపోయారు. 2019లో టీడీపీ టిక్కెట్‌పై బరిలో దిగి ఓటమి చవిచూశారు. మూడోసారి పీలేరు నుంచే బరిలోకి దిగనున్నారు
  • గాలి భానుప్రకాశ్ (నగరి): మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడి కుమారుడు. 2019లో నగరి నుంచి పోటీ చేసి ఓడిపోయినా మళ్లీ అక్కడి నుంచే బరిలో నిలిచారు.

Go Back to Shorts
Telugudesam
Andhra Pradesh

More Telugu News