Chinthamaneni Prabhakar: చింతమనేని, నూజివీడు డీఎస్పీ మధ్య వాగ్వాదం
ఏలూరు జిల్లా పెదపాడు మండలం వీరమ్మకుంట సర్పంచ్ స్థానానికి ఈరోజు పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించాలని వైసీపీ, టీడీపీ పట్టుదలగా ఉన్నాయి. ఉదయం పోలింగ్ ప్రారంభమైన తర్వాత వీరమ్మకుంట పోలింగ్ కేంద్రం వైపు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెళ్తున్న సమయంలో ఆయనను నూజివీడు డీఎస్పీ అశోక్ కుమార్ ఆపారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న అందరినీ ఇక్కడి నుంచి పంపిస్తే తాను కూడా వెళ్లిపోతానని చింతమనేని అన్నారు. వారిని పంపిస్తామని... ముందు మీరు తమకు సహకరించాలని డీఎస్పీ కోరారు. దీంతో చింతమనేని అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు అక్కడున్న టీడీపీ నేతలు, కార్యకర్తలతో చింతమనేని మాట్లాడుతూ... ఎవరున్నా, లేకపోయినా గెలుపును, ఓటమిని ఆపలేరని చెప్పారు.