శకపురుషుడు ఎన్టీఆర్ తెలుగుజాతికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటారు: విజయేంద్రప్రసాద్

Vijayendra Prasad heaps praise on NTR
  • ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో సమాలోచన కార్యక్రమం
  • హాజరైన విజయేంద్రప్రసాద్, పరుచూరి గోపాలకృష్ణ, నందమూరి రామకృష్ణ తదితరులు
  • ఎన్టీఆర్ ను వేనోళ్ల కీర్తించిన వైనం
తెలుగు జాతికి గుర్తింపు, గౌరవాన్ని తీసుకొచ్చిన మహనీయ నటుడు, నాయకుడు నందమూరి తారక రామారావు అని, ఆయన తెలుగు జాతికి ఎప్పటికీ స్పూర్తినిస్తూనే ఉంటారని ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఎన్టీఆర్ శకపురుషుడని కొనియాడారు. 

ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా, ఎన్టీఆర్ శాసనసభ ప్రసంగాలు, ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలతోపాటు శకపురుషుడు ప్రత్యేక సంచికపై సమాలోచన కార్యక్రమాన్ని ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కమిటీ ఇవాళ నిర్వహించింది. 

ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయేంద్రప్రసాద్ ఎన్టీఆర్ సినిమా, రాజకీయ జీవితంపై వెలువరించిన శకపురుషుడు, ఆయన ప్రసంగాల పుస్తకాలను ఈ తరం తప్పకుండా చదవాలని, ఎన్టీఆర్ నుంచి స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ టి.డి. జనార్దన్, ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ, లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ, నటుడు సుమన్, సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శకుడు బి.గోపాల్ తదితరులు కూడా పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమంలో లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ... ఎన్టీఆర్ పేద ప్రజల అభ్యున్నతి కోసం విశేషమైన కృషి చేశారని, ముఖ్యమంత్రిగా అలాంటి వారు ప్రపంచంలోనే చాలా అరుదుగా ఉంటారని పేర్కొన్నారు. 

ఆయన ఏది అనుకుంటే అది సాధించే దాకా నిద్రపోరని, 40 సంవత్సరాల క్రితమే ప్రతిపక్షాలను ఐక్యం చేసిన ఘనత ఎన్టీఆర్ ది అని చెప్పారు. కమిటీ వెలువరించిన ఈ మూడు గ్రంథాలు ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని తెలియజేస్తాయని ఈ గ్రంథాలు ప్రజలందరికి చేరాలని తాను కోరుకుంటున్నానని జేపీ తెలిపారు. 

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ... ఎన్టీఆర్ తనకు దైవంతో సమానమని అన్నారు. ఆయనతో పనిచేసే అవకాశం, అదృష్టం తనకు కలిగాయని చెప్పారు. ఎన్టీఆర్ శతాబ్ది సందర్భంగా కమిటీ వెలువరించిన మూడు గ్రంథాలలో శకపురుషుడు అత్యున్నతమైనదని, అలాంటి గ్రంథాన్ని ఈ తరం పాఠకులకు అందించినందుకు కమిటీని అభినందిస్తున్నానని తెలిపారు. శకపురుషుడు ప్రతి ఇంటిలో ఉండదగ్గ పుస్తకమని స్పష్టం చేశారు. 

సుమన్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ తో నటించే అవకాశం కలగకపోయినా ఆయనను మూడుసార్లు కలిశామని వెల్లడించారు. ఆయన ఎంతో ఆప్యాయంగా తనను ఆదరించి, మాట్లాడటం జీవితంలో మరచిపోలేని అనుభవమని పేర్కొన్నారు. 

ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టినప్పుడు స్ఫూర్తి పొంది విరాళంగా లక్ష రూపాయలను ఇచ్చిన ఆనందం తనకు మధుర స్మృతిగా మిగిలిపోతుందని తెలిపారు. 

దర్శకుడు బి. గోపాల్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ ను దూరంగా చూస్తేనే జీవితం ధన్యమైపోతుందనుకున్న రోజులున్నాయని, అలాంటిది అడవి రాముడు సినిమా షూటింగ్ అప్పుడు ఆయన పక్కనే నిలబడి క్లాప్ కొట్టే అవకాశం వచ్చినప్పుడు జీవితంలో ఈ తృప్తి, ఈ ఆనందం చాలు అని అనుకున్నానని వివరించారు. ఆయన నిజంగా దైవాంశ సంభూతుడని అన్నారు.

నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ... నాన్నగారి శతాబ్ది ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా జరగటం తమ కుటుంబానికి ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని కలగజేశాయని తెలిపారు. 

అన్న బాలకృష్ణ, నా వివాహం తిరుపతిలో జరిగినప్పుడు నాన్నగారు స్వయంగా రాలేదని బాధపడినా... ఆయన ప్రజల కోసం ప్రచారంలో ఉన్నాడని తెలిసి గర్వపడ్డామని చెప్పారు. నాన్నగారి కృషి, పట్టుదల తమకు వారసత్వంగా వచ్చాయని రామకృష్ణ ఈ సందర్భంగా తెలిపారు. 

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ టి.డి. జనార్దన్ మాట్లాడుతూ.. అన్నగారి శతాబ్ది సంవత్సరంలో వారికి నివాళిగా ఏదైనా చేయాలనే సంకల్పంతో ఒక కమిటీగా ఏర్పాటయ్యామని అన్నారు.

అన్నగారి శాసనసభ ప్రసంగాలు, చారిత్రక ప్రసంగాలు, శకపురుషుడు పుస్తకాలు తీసుకు రావటానికి ఎనిమిది నెలలు అవిశ్రాంతంగా శ్రమించామని కమిటీ సభ్యులంతా నిబద్ధతతో పనిచేశారని వెల్లడించారు. ఇప్పుడు ఆ పుస్తకాలను అందరూ ప్రశంసిస్తుంటే తమకెంతో సంతోషంగాను, సంతృప్తిగాను ఉందని తెలిపారు.

అన్నగారి వంద అడుగుల విగ్రహాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిష్టించాలనే సంకల్పంతో ఈ కమిటీ పనిచేస్తోందని, ఈ కమిటీని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తున్నారని ఈ సందర్భంగా చెప్పారు.

Go Back to Shorts
NTR
K V Vijayendra Prasad
NTR Centinary Committee

More Telugu News