Kodali Nani: చంద్రబాబు, లోకేశ్ ను తరిమికొట్టి.. ఎన్టీఆర్ వారసులు టీడీపీని స్వాధీనం చేసుకుంటారు: కొడాని నాని

  • ఎన్టీఆర్ పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారన్న కొడాలి నాని
  • ఆయన ఆకర్షణీయమైన అబద్ధాలు, వెన్నుపోట్లు ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్య
  • చంద్రబాబు, లోకేశ్ కు దమ్ముంటే గుడివాడ, గన్నవరంలో పోటీ చేయాలని సవాల్
kodali nani fires on chandrababu and nara lokesh

ఎన్టీఆర్ పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధమయ్యారని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. ఎన్టీఆర్ ఉంటే పార్టీ, రాష్ట్రం నాశనం అవుతుందన్న చంద్రబాబు.. గతిలేక, రాజకీయంగా బతకడానికి తిరిగి ఎన్టీఆర్ పేరు వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ రోజు గుడివాడలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి కొడాలి నాని నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేశ్ ను తరిమికొట్టి.. ఎన్టీఆర్ వారసులు టీడీపీని స్వాధీనం చేసుకుంటారని జోస్యం చెప్పారు. దేశమంతా తిరిగినా చంద్రబాబు లాంటి నీచ రాజకీయ నాయకుడు మరొకరు ఉండరని మండిపడ్డారు. చంద్రబాబు ఆకర్షణీయమైన అబద్ధాలు, వెన్నుపోట్లు ప్రజలందరికీ తెలుసన్నారు. 

స్క్రాప్ బ్యాచ్ అంతా రాజమండ్రిలో మహానాడు సభ పెట్టుకున్నారని కొడాలి నాని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్ కు దమ్ముంటే గుడివాడ, గన్నవరంలో పోటీ చేయాలని సవాల్ చేశారు. ‘‘రాజకీయాలంటే బట్టల వ్యాపారమా ఆకర్షణీయమైన మేనిఫెస్టో పెట్టడానికి? చంద్రబాబుకు 2024 ఎన్నికల్లో ఎదురు దెబ్బ తప్పదు’’ అని అన్నారు.

More Telugu News