Advertisement

40 నుంచి 50 స్థానాల్లో కాంగ్రెస్ కు అభ్యర్థులు కూడా లేరు: హరీశ్ రావు

BRS will win in next election says Harish Rao
  • బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచిందన్న హరీశ్
  • 50 ఏళ్లలో జరగని అభివృద్ధిని కేసీఆర్ చేసి చూపించారని ప్రశంస
  • ఈ ఏడాది 9 మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తున్నామని వెల్లడి
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టబోతోందని... వచ్చే ఎన్నికల్లో మూడో సారి అధికారాన్ని చేపట్టబోతోందని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో నిలిచిందని... వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచినందుకే ఈ ఘనతను సాధించిందని ఆయన చెప్పారు. 50 ఏళ్లలో జరగని అభివృద్ధిని కేసీఆర్ చేసి చూపించారని అన్నారు. రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరుగుతున్నా విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. 

గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 15 వేల బెడ్స్ ఉండేవని... వాటి సంఖ్యను 50 వేలకు పెంచామని హరీశ్ తెలిపారు. గత ఐదేళ్లలో లక్ష 50 వేల ఉద్యోగాలను ఇచ్చామని చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలో 9 మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తామని తెలిపారు. 

వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారని... మునుగోడు ఎన్నికల్లో ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకోవాలని హరీశ్ అన్నారు. మునుగోడులో కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా దక్కలేదని ఎద్దేవా చేశారు. 40 నుంచి 50 స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ కు అభ్యర్థులు కూడా లేరని అన్నారు. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ కు కంచుకోట అని... అన్ని స్థానాలను కైవసం చేసుకుంటామని చెప్పారు.
Advertisement
Harish Rao
BRS

More Telugu News