Karnataka: కర్ణాటక ఎన్నికల్లో కమల హాసన్‌ మద్దతు ఆ పార్టీకే!

  • కాంగ్రెస్ తరఫున  ప్రచారం చేయనున్న ‘మక్కల్‌ నీదిమయ్యం’ పార్టీ అధినేత
  • రాహుల్ గాంధీ సూచన మేరకు కీలక నిర్ణయం తీసుకున్న సీనియర్ హీరో
  • లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో మక్కల్‌ నీదిమయ్యం పార్టీ పొత్తుకు అవకాశం
Kamal haasan to campaign for congress in Karnataka

కర్ణాటక శాసనసభ ఎన్నికల విషయంలో ప్రముఖ సినీనటుడు, ‘మక్కల్‌ నీదిమయ్యం’ పార్టీ అధినేత కమల హాసన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‏కు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ కోరిక మేరకు ఆయన మే మొదటివారంలో కాంగ్రెస్‌ కూటమికి మద్దతుగా ప్రచారం చేస్తారని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఆయన ప్రచార పర్యటన వివరాలు వెల్లడిస్తామన్నారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర నిర్వహించినప్పుడు స్టార్ హీరో ఢిల్లీలో ఆయనతో కలిసి పాదయాత్ర చేశారు. 

ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపు కోసం కమల హాసన్  ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే యేడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో మక్కల్‌ నీదిమయ్యం కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకోవటం ఖాయమని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడున్నారు. లోక్‌సభ ఎన్నికల విషయమై కమల హాసన్ మూడు రోజుల కిందట  కోయంబత్తూరు, సేలం జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‏తో పొత్తు ఖరారైతే కమల హాసన్‌ కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం ఉంది.

More Telugu News