Maharashtra: రాయగడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు లోయలో పడి 13 మంది దుర్మరణం

  • పూణె-రాయగడ్ సరిహద్దులో ప్రమాదం
  • ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు
  • తీవ్రంగా గాయపడిన మరో 25 మంది
  • కర్ణాటకలో జరిగిన ప్రమాదంలో నలుగురి మృతి
Road Accidents in Maharashtra and Karnataka 17 dead

మహారాష్ట్రలోని రాయగడ్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూణెలోని పింపుల్‌ గురవ్ నుంచి గోరేగావ్ వెళ్తున్న బస్సు ఈ తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో పూణె-రాయగడ్ సరిహద్దులో ప్రమాదానికి గురైంది. అదుపు తప్పిన బస్సు లోయలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు. బస్సులో చిక్కుకున్న వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. రాయగడ్‌లోని ఖోపోలి ప్రాంతంలో ప్రమాదం జరిగినట్టు రాయగడ్ ఎస్పీ సోమనాథ్ ఘార్గ్  తెలిపారు.  

కర్ణాటకలో నలుగురు
   
కర్ణాటకలోని తుముకూరు జిల్లా హిరాహేళిలో ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఎస్‌యూవీ, ప్రైవేటు బస్సు ఢీకొన్న ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను తుముకూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News