KCR: మహారాష్ట్ర గడ్డపై ఫడ్నవిస్ కు సవాల్ విసిరిన కేసీఆర్

  • మహారాష్ట్రలోని కాందార్ లోహలో కేసీఆర్ సభ
  • దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోందని వ్యాఖ్య
  • తెలంగాణలోని పథకాలు మహారాష్ట్రలో అమలు చేయాలని డిమాండ్
KCR challenge to Devendra Fadnavis

మహారాష్ట్రలోని ప్రతి జిల్లాపరిషత్ లో గులాబీ జెండా ఎగరడమే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ను మహారాష్ట్రలో కూడా రిజిస్టర్ చేయించామని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. మహారాష్ట్రలోని కాందార్ లోహలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

తమ ప్రాంతంలో సభ పెట్టాలని కోరుతూ మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి వినతులు వస్తున్నాయని... తర్వాతి సభను షోలాపూర్ లో పెడతామని కేసీఆర్ చెప్పారు. నాందేడ్ లో తాము సభ పెట్టిన వెంటనే రైతుల ఖాతాల్లో రూ. 6 వేలు జమ చేశారని... బీఆర్ఎస్ సభ సత్తా ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని అన్నారు. రైతులు ఐక్యంగా ఉండి పిడికిలి బిగిస్తే న్యాయం జరుగుతుందని చెప్పారు. ఒకప్పుడు మహారాష్ట్ర కంటే తెలంగాణ దారుణంగా ఉండేదని... ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా మారిందని అన్నారు. మహారాష్ట్రలో సంపదకు కొదవ లేదని... అయితే దాన్ని ప్రజలకు ఇవ్వాలన్న ఆలోచన పాలకులకు లేదని చెప్పారు. రైతులు ఝలక్ ఇస్తే మొత్తం మారిపోతుందని అన్నారు. 

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోందని కేసీఆర్ అన్నారు. దేశాన్ని 54 ఏళ్లు కాంగ్రెస్, 14 ఏళ్లు బీజేపీ పాలించి చేసిందేమీ లేదని విమర్శించారు. కృష్ణా, గోదావరి నదులు పుట్టే మహారాష్ట్రలో సాగు, తాగు నీరు చాలా చోట్ల అందుబాటులో లేదని చెప్పారు. పాలకులు మారుతున్నా ప్రజల తలరాత మాత్రం మారడం లేదని అన్నారు. ఉల్లి, చెరుకు ధర కోసం రైతులు ప్రతిఏటా పోరాడాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు మహారాష్ట్రలో అమలయ్యేంత వరకు తాను ఇక్కడకు వస్తూనే ఉంటానని చెప్పారు. తెలంగాణ పథకాలను మహారాష్ట్రలో అమలు చేస్తే ఇక్కడకు రానేరానని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ కీలక నేత ఫడ్నవిస్ కు సవాల్ విసిరారు. మహారాష్ట్రలో కూడా దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

More Telugu News