దమ్ముంటే అసెంబ్లీలో జరిగిన దాన్ని ఎడిట్ చేయకుండా విడుదల చేయండి: వైసీపీకి టీడీపీ సవాల్
- ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై వైసీపీ సభ్యుల దాడి
- తనపై సుధాకర్ బాబు, ఎలీజా దాడి చేశారన్న బాల వీరాంజనేయస్వామి
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపును పక్కదోవ పట్టించేందుకు ఈ దాడి చేశారని విమర్శ
బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ... తనపై వైసీపీ ఎమ్మెల్యేలు సుధాకర్ బాబు, ఎలీజా దాడి చేశారని చెప్పారు. స్పీకర్ పోడియం వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే దాడికి పాల్పడ్డారని అన్నారు. శాసనసభను కౌరవసభగా మార్చేశారని మండిపడ్డారు. తమపై దాడి చేసి... తామే వారిపై దాడి చేసినట్టు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని అన్నారు. స్పీకర్ పై తాను అనుచితంగా ప్రవర్తించినట్టైతే తనకు ఏ శిక్ష విధించినా కట్టుబడి ఉంటానని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపును పక్కదోవ పట్టించేందుకే ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా చేశారని మండిపడ్డారు. స్పీకర్ సమక్షంలోనే తనపై దాడి చేశారని... వారిపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.