Raja Singh: మొరాయిస్తున్న బులెట్ ప్రూఫ్ వాహనం.. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరో వాహనం కేటాయించిన ప్రభుత్వం

  • ఎక్కడపడితే అక్కడ ఆగిపోతున్న పాత వాహనం
  • దానిని మార్చాలంటూ పలుమార్లు కేసీఆర్‌కు మొర
  • ఇటీవల ప్రగతి భవన్ వద్ద వాహనాన్ని విడిచిపెట్టి వచ్చిన ఎమ్మెల్యే
  • 2017 నాటి వాహనాన్ని రాజాసింగ్ ఇంటి వద్ద వదిలి వచ్చిన పోలీసులు
TS Govt changed Goshamahal MLA Raja Singh bullet proof vehicle

బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్‌కు తెలంగాణ ప్రభుత్వం మరో బులెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. ఆయనకు గతంలో కేటాయించిన వాహనం తరచూ మొరాయిస్తున్న నేపథ్యంలో దాని స్థానంలో మరో దానిని సమకూర్చింది. తనకు కేటాయించిన వాహనం ఎక్కడపడితే అక్కడ ఆగిపోతోందని, ఇబ్బంది పెడుతోందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్, హోంమంత్రి, డీజీపీకి రాజాసింగ్ పలుమార్లు మొరపెట్టుకున్నారు. అంతేకాదు, ఇటీవల ప్రగతి భవన్‌కు వెళ్లి ఆ వాహనాన్ని అక్కడే వదిలిపెట్టి వచ్చారు. 

ఈ నేపథ్యంలో పోలీసులు నిన్న ఆయనకు వేరే వాహనాన్ని సమకూర్చారు. 2017 నాటి ఈ వాహనాన్ని రాజాసింగ్ ఇంటి వద్దకు తీసుకెళ్లి వదిలిపెట్టారు. తనకు మరో వాహనం కేటాయించడంపై రాజాసింగ్ స్పందించారు. తాను ప్రస్తుతం ఇంటి వద్ద లేనని, వెళ్లాక వాహనం కండిషన్ చూస్తానని పేర్కొన్నారు. తనకు కొత్త వాహనమే కావాలనేం లేదని, పాతదైనా కండిషన్‌లో ఉంటే చాలని రాజాసింగ్ అన్నారు.

More Telugu News