Advertisement

టైఫాయిడ్ వచ్చినా పోరాటం ఆగదు.. ప్రధాన్ రాజీనామానే లక్ష్యం: అభిజీత్ దీప్కే

Abhijit Dipke says fight continues despite typhoid for Dharmendra Pradhan resignation
  • టైఫాయిడ్‌తో బాధపడుతున్నా పోరాటం ఆగదన్న అభిజీత్ దీప్కే
  • ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే తమ ప్రధాన డిమాండ్ అని స్పష్టం చేసిన సీజేపీ
  • ప్రధాన్ రాజీనామా చేయకుంటే చర్చలు ఎందుకని ప్రశ్నించిన పార్టీ ప్రతినిధి
  • 47 మంది ఎన్‌టీఏ అధికారులను తొలగించిన కేంద్ర ప్రభుత్వం
  • పేపర్ లీకేజీలపై కఠిన చట్టానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్న 'కాక్‌రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తన ఆరోగ్యంపై కీలక అప్‌డేట్ ఇచ్చారు. తాను టైఫాయిడ్‌తో బాధపడుతున్నట్లు ప్రకటించారు. అయితే, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ నిరసన ఉద్యమం ఆగదని ఆయన స్పష్టం చేశారు.

సోషల్ మీడియా 'ఎక్స్' వేదికగా దీప్కే ఒక వీడియో సందేశాన్ని పంచుకున్నారు. "కొన్ని రోజులుగా నా ఆరోగ్యం బాగోలేదని మీ అందరికీ తెలుసు. రక్త పరీక్షల రిపోర్టులు వచ్చాయి. నాకు టైఫాయిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. చికిత్స తీసుకుంటున్నాను. ప్రతిరోజూ ఉదయం ఐవీ డ్రిప్స్ ఎక్కిస్తున్నారు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు మా పోరాటం కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న 'కాక్‌రోచ్'లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన శాంతియుత పోరాటం కొనసాగితే ప్రధాన్ రాజీనామా చేయడం ఖాయం" అని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు కేంద్ర ప్రభుత్వంతో మూడో విడత చర్చలు జరగనున్న నేపథ్యంలో సీజేపీ తన వైఖరిని మరింత స్పష్టం చేసింది. ప్రభుత్వ పరీక్షల (అక్రమ మార్గాల నివారణ) చట్టం-2024కు సవరణలు, విద్యా సంస్కరణల నిర్ణయాలను స్వాగతిస్తున్నామని, కానీ తమ ప్రధాన డిమాండ్ అయిన విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదని సీజేపీ ప్రతినిధి అశుతోష్ రాంకా స్పష్టం చేశారు.

మీడియాతో మాట్లాడుతూ.. "నిన్న జరిగిన చర్చల్లో నష్టపరిహారం, చట్టపరమైన కేసుల విషయంలో సానుకూల స్పందన వచ్చింది. దీనిపై లిఖితపూర్వక హామీ లభిస్తుందని ఆశిస్తున్నాం. అయితే, మా ప్రధాన డిమాండ్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఎలాంటి స్పష్టమైన నిర్ణయం వెలువడలేదు. ఆయన రాజీనామా చేయబోరని మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. అదే నిజమైతే, ఇక చర్చలు జరపడంలో అర్థం లేదు. మా తదుపరి వ్యూహంతో ముందుకు వెళ‌తాం" అని రాంకా హెచ్చరించారు.

ఇటీవల ప్రభుత్వం ఎడ్యుకేషన్ సెక్రటరీని బదిలీ చేయడం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)కి చెందిన 47 మంది అధికారులను తొలగించడంపై రాంకా స్పందిస్తూ, ఈ చర్యలు సరిపోవని అన్నారు. "అసలు బాధ్యత ఈ దేశ విద్యాశాఖ మంత్రిదే. నీట్ పేపర్ లీక్ తర్వాత విద్యార్థుల ఆత్మహత్యలకు, జరిగిన నష్టానికి ఆయనే బాధ్యత వహించి రాజీనామా చేయాలి" అని డిమాండ్ చేశారు.

కాగా, ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న‌ జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పేపర్ లీకేజీలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునే ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడితే పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 10 కోట్ల వరకు జరిమానా విధించేలా చట్టంలో సవరణలు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న చట్టంలో గరిష్ఠంగా ఐదేళ్ల జైలు, రూ. కోటి జరిమానా మాత్రమే ఉంది.
Advertisement
Abhijit Dipke
Dharmendra Pradhan
Cockroach Janata Party
Paper Leak Protest
Education Minister Resignation
NEET NTA Controversy

More Telugu News