బీబీనగర్-ఘట్‌కేసర్ రైల్వే ట్రాక్ పునరుద్ధరణ.. యథావిధిగా రైళ్ల రాకపోకలు

South Central Railway Restored Railway Track In Ghatkesar section
  • నిన్న ఉదయం ఘట్‌కేసర్ మార్గంలో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు
  • దెబ్బతిన్న ట్రాక్‌కు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు
  • రాత్రి 9.15 గంటలకు ఆ మార్గంలో ప్రయాణించిన శబరి ఎక్స్‌ప్రెస్
గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు నిన్న ఉదయం పట్టాలు తప్పడంతో ధ్వంసమైన రైల్వే ట్రాక్‌ను అధికారులు పునరుద్ధరించారు. విశాఖపట్టణం నుంచి హైదరాబాద్ వెళ్తున్న రైలు మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ వద్ద పట్టాలు తప్పింది. నాలుగు బోగీలు పక్కకు ఒరిగిపోవడంతో వాటిని అక్కడే వదిలేసి మిగిలిన బోగీలతో రైలు సికింద్రాబాద్ చేరుకుంది. బోగీలను అక్కడే వదిలేయడంతో ఆ మార్గంలో ప్రయాణించాల్సిన ఏడు రైళ్లను నిన్న రద్దు చేశారు. మరో 12 రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు.

మరోవైపు, దెబ్బతిన్న ట్రాక్‌కు మరమ్మతులు నిర్వహించిన అధికారులు ట్రాక్‌ను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఓవర్‌హెడ్ విద్యుత్ సరఫరాను కూడా పునరుద్ధరించడంతో తిరిగి రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. గత రాత్రి 9.15 గంటలకు త్రివేండ్రం-సికింద్రాబాద్ మధ్య నడిచే శబరి ఎక్స్‌ప్రెస్ (17229) రైలు ఈ మార్గంలో ప్రయాణించింది. ఆ తర్వాత అన్ని రైళ్లను పునరుద్ధరించారు.
Advertisement
Godavari Express
Ghatkesar
South Central Railway
Sabari Express

More Telugu News