Revanth Reddy: పార్టీకి నష్టం కలిగేలా మాట్లాడితే చర్యలు తప్పవు: రేవంత్ రెడ్డి

  • తెలంగాణ కాంగ్రెస్ లో లుకలుకలు!
  • ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలన్న రేవంత్ రెడ్డి
  • లేకపోతే కొత్తవారికి అవకాశం ఇస్తామని వెల్లడి
Revanth Reddy warns party leaders for indiscipline

పార్టీ నియమావళి ఉల్లంఘించేవారిని ఇక ఉపేక్షించేది లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ కార్యకలాపాల్లో బాధ్యతగా పనిచేయని వారిని తప్పించి, కొత్తవారికి బాధ్యతలు అప్పగిస్తామని వెల్లడించారు. కోమటిరెడ్డిపై టీపీసీసీ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని కొండా సురేఖ మీడియా ఎదుట వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

కాగా, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అందరినీ కలుపుకుని వెళ్లాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిదేనని స్పష్టం చేశారు. పార్టీలో ఇంకా అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతుంటే ఎన్నికలకు ఎప్పుడు వెళతామని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఎవరూ మాట్లాడరాదని అన్నారు. తాను ఎవరికీ అనుకూలం కాదు, ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

More Telugu News