Tollywood: తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సీనియర్​ హీరో

  • రెండు రోజులుగా అతిసార వ్యాధితో బాధపడుతున్న శరత్ కుమార్ 
  • చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న నటుడు
  • ఆయన వెంట ఉన్న భార్య రాధిక, కూతురు వరలక్ష్మి
Sarathkumar admitted to Chennai hospital

దక్షిణాదిలో ఎంతో గుర్తింపు ఉన్న తమిళ నటుడు, సీనియర్ హీరో శరత్ కుమార్ ఆసుపత్రి పాలయ్యారు. తీవ్ర అస్వస్థత కారణంగా ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయన భార్య రాధిక, కూతురు వరలక్ష్మి ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సమాచారం తెలియగానే పలువురు కోలీవుడ్ ప్రముఖులు శరత్ కుమార్ ను పరామర్శిస్తున్నారు. ఆయన రెండు రోజులుగా అతిసార వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న శరత్ కుమార్ అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా.. డయేరియా కారణంగా డీహైడ్రేషన్‌కు గురయ్యారని వైద్యులు తెలిపారు. 

శరత్ కుమార్ ఆరోగ్య పరిస్థితిపై ఈరోజు ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉందని తమిళ మీడియా చెబుతోంది. శరత్ కుమార్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా శరత్‌కుమార్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నడిగర్ సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఇప్పటికే దక్షిణాది భాషల్లో 130కి పైగా చిత్రాల్లో హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మెప్పించారు.

More Telugu News