Tollywood: 'డీజే టిల్లు2' చిత్రానికి హీరోయిన్ టెన్షన్!

  • సీక్వెల్ నుంచి తప్పుకున్న అనుపమ పరమేశ్వరన్
  • తర్వాత శ్రీలీల, మడోన్నా కూడా!
  • ఇప్పుడు మీనాక్షి చౌదరి వచ్చిందంటూ వార్తలు
 Is this the reason for heroines walking out of DJ Tillu 2

గతేడాది చిన్నసినిమాగా వచ్చి భారీ విజయం సొంతం చేసుకున్న చిత్రం డీజే టిల్లు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. చిత్ర బృందానికి కాసుల వర్షం కురిపించింది. అద్భుత నటనతో చిత్రాన్ని వన్ మ్యాన్ షోగా నడిపించి మెప్పించిన హీరో సిద్ధు జొన్నలగడ్డకు ఈ చిత్రం ఎంతో పేరు తెచ్చి పెట్టింది. ఈ చిత్రం తర్వాత యువతలో అతనికి మంచి ఫాలోయింగ్  వచ్చింది. ఎక్కడికి వెళ్లినా సిద్దును డీజే టిల్లు అని పిలుస్తున్నారు. 

ఇక ఈ చిత్రానికి కొనసాగింపు ఉంటుందని చిత్ర బృందం ప్రకటించింది. దాంతో, డీజే టిల్లు పార్ట్ 2 కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. షూటింగ్ మొదలైనట్లు చిత్ర బృందం ఆసక్తికర వీడియో ద్వారా తెలియజేసి ఆసక్తిని రెట్టింపు చేసింది. 

తొలి పార్టులో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. రెండో పార్టులో వేరే హీరోయిన్ ఉంటుందని చిత్ర బృందం ప్రకటించింది. కానీ, హీరోయిన్ విషయమే ఇప్పుడు డీజే టిల్లు చిత్ర బృందానికి సవాల్ గా మారింది. సీక్వెల్‌లో ముందుగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. అయితే షూటింగ్‌ మొదలైన కొన్ని రోజులకే ఆమె తప్పుకుంది. 

ఆ తర్వాత యువ హీరోయిన్ శ్రీలీల పేరు తెరపైకి వచ్చింది. ఆమె కూడా ఆఖర్ వదులుకోగా ప్రేమమ్ ఫేమ్ మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్‌గా ఎంపికైందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు మడోన్నా కూడా కాదనడంతో మీనాక్షి చౌదరిని హీరోయిన్ గా ఖరారు చేసినట్టు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. హిట్‌-2తో ఆమె ఈ మధ్యే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 

అయితే, మీనాక్షి గురించి డీజే టిల్లు నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. దాంతో, తనైనా చేస్తుందా? లేక హీరోయిన్ వేట కొనసాగుతూనే ఉంటుందా? అన్న చర్చ నడుస్తోంది. ఎక్కువ శృంగార సన్నివేశాలు, లిప్ లాక్స్ ఉండటం వల్లనే హీరోయిన్లు వెనక్కి తగ్గుతున్నారని తెలుస్తోంది. ఏదేమైనా డీజే టిల్లు సీక్వెల్ కంటే హీరోయన్ ఎవరన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.

More Telugu News